ప్రత్తిపాడు: అరుదైన సమస్యతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి కాటూరి వైద్యుల బృందం విజయవంతంగా శస్త్ర చికిత్సను చేసింది. వివరాలు.. గ్రామానికి చెందిన రితిక(6) తన మూడవ సంవత్సరం నుండే మూత్రకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. బాలికను ఆమె తల్లిదండ్రులు ఇటీవల ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలోని కాటూరి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యుల బృందం బాలికకు సీటీ యూరోగ్రామ్ పరీక్షలు చేసి రెండు వైపులా డ్యూప్లెక్స్ కిడ్నీలు, డబుల్ యూరేటర్లు (మూత్రనాళాలు) ఉన్నట్లు నిర్ధారించారు. కుడి వైపునున్న కిడ్నీ ఎగువ భాగం మూత్రనాళం బాగా ఉబ్బి, వంకర్లు తిరిగి యోని లోపలకు తెరుచుకుని ఉండటం వలనే నిరంతరం యోని నుంచి ద్రవ స్రావం అవుతున్నట్లు గుర్తించారు. దీంతో కుడి కిడ్నీలో పనిచేయని ఎగువ భాగాన్ని, ఉబ్బి వంకర్లు తిరిగిన ఎగువ మూత్రనాళాన్ని డాక్టర్ బి.ప్రకాశరావు, డాక్టర్ నిషాంత్, డాక్టర్ వెంకటేశ్వరరావులతో కూడిన వైద్యుల బృందం గురువారం శస్త్రచికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వ్యాధి వివరాలను వైద్యుల బృందం వెల్లడించింది. చిన్నపిల్లల్లో నిరంతర యోని స్రావాలు, పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తే ‘ఎక్టోపిక్ యూరేటర్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ఎక్టోపిక్ యూరేటర్ చాలా అరుదైన సమస్యని, రెండు నుంచి నాలుగు వేల మందిలో ఒకరు ఈ సమస్య బారిన పడతారని తెలిపారు. అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యుల బృందాన్ని మేనేజ్మెంట్ అభినందించింది.
ఎక్టోపిక్ యూరేటర్ సమస్యకు సమర్థంగా చికిత్స


