రూ.249.50 కోట్లతో 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులకు నడ్డా, చంద్రబాబు చేతుల మీదుగా నేడు శ్రీకారం సెప్టెంబరు 17 నుంచి నెల రోజుల ‘సేవా సంకల్ప్ అభియాన్’ రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు రూ.1,272 కోట్లతో చేపట్టిన ఆరోగ్య వసతుల పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం గుంటూరు మెడికల్ కాలేజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.249.50 కోట్లతో పూర్తి చేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులను శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇందులో రూ.234.50 కోట్లతో 10 అత్యవసర చికిత్స కేంద్రాలు, రూ.15 కోట్లతో 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 24 అత్యవసర చికిత్స కేంద్రాలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 10 పూర్తయ్యాయని చెప్పారు. సెప్టెంబరు నెలాఖరుకు మరో మూడు పూర్తి చేసి, మార్చి నాటికి మొత్తం 24 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
డిసెంబరులో ‘సంజీవని’
డిసెంబరులో రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులను అనుసంధానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు వివరించారు.


