లక్ష్మీపురం: సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో అర్ధరాత్రి చైన్ లాగి ఇద్దరు మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కొని పరారీ అయిన భవారియా గ్యాంగ్లో మూడో నిందితుడిని రైల్వే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గుంటూరు రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో గుంటూరు రైల్వే పోలీస్ డీఎస్పీ అక్కేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమంయలో చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఆరుగురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భవారియా గ్యాంగ్ దుండగులు, అప్పికట్ట రైల్వే స్టేషన్ సమీపంలోని నాగరాజు కాలువ వద్దకు రాగానే చైన్ లాగి రైలును నిలిపి వేశారు. రైలులోని ఎస్–3, ఎస్–6 బోగీలలో ఇద్దరు మహిళలల మెడల్లో సుమారు 75 గ్రాముల బంగారు గొలుసులు లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు యత్నించిన రైలు బందోబస్తు పోలీసు సిబ్బంది అయిన కొండెపి సాయి, ప్రయాణికులపై కంకర రాళ్లతో, క్యాట్ బాల్తో దాడి చేయడంతో పాటు కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు హెచ్చరించినప్పటికీ దుండగులు వినక పోవడంతో ఆత్మ రక్షణార్థం ఎస్ఎల్ఆర్ ఆయుధంతో ఏఆర్ పోలీసులు వి.రవికుమార్, కె.బాలకెంటరెడ్డి, ఆర్పీఎఫ్ సిబ్బంది ఎం.అలెగ్జాండర్, ఎం.వెంకటనాగరాజు పది రౌండ్లు నిందితులపై కాల్పులు జరిపారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై తెనాలి పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ లోదే సరస్వతి కేసు నమోదు చేశారు. జూలై 3వ తేదీన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సాంకేతిక ఆధారాలతో అరెస్టు
దర్యాప్తులో భాగంగా హరియాణా రాష్ట్రం నూహ జిల్లా, సాంగెల్ గ్రామానికి చెందిన నిందితులలో ఒకరైన ఏ 3 కిషన్ సింగ్ అలియాస్ సీతారామ్ను ఈనెల 8వ తేదీన గ్రామంలోని ఇంటి వద్ద అరెస్ట్ చేసి నూహా స్థానిక కోర్టులో హాజరు పరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పొంది శుక్రవారం గుంటూరు ఫస్ట్ క్లాస్ రైల్వే కోర్టులో హాజరు పరిచారు. సాంకేతిక ఆధారాలతో ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచిన గుంటూరు రైల్వే డీఎస్పీ పి.అక్కేశ్వరరావు, గుంటూరు లైన్ సర్కిల్ సీఐ పి.నరసింహారావు, చీరాల పోస్ట్ ఐపీఎఫ్ బి.చంద్రశేఖర్రావు, గుంటూరు ఆర్పీఎఫ్ ఎస్ఐ షేక్ మహబూబ్ సుభాని, ఆర్పీఎఫ్ ఇన్చార్జి మహిళా ఎస్ఐ ఎల్.సరస్వతి, నరసరావుపేట, బాపట్ల ఆర్పీఎఫ్ ఎస్ఐలు ఎం.రాజమోహన్, ఎస్.మనోజ్కుమార్రెడ్డి, చీరాల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పూర్ణచంద్రారావు, ఒంగోలు ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బజార్, రేపల్లె ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గోపీలను రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
గత రెండు సంవత్సరాలుగా చేసిన నేరాలు ఇవే...
ఈ నేరంతో పాటుగా రాజస్థాన్ భవారియా గ్యాంగ్ గుంటూరు రైల్వే పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గత రెండు సంవత్సరాల నుంచి చైన్ లాగి, సిగ్నల్ ట్యాంపరింగ్ నేరాలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కిషన్ సింగ్ను విచారించగా గుంటూరు జీఆర్పీ సబ్ డివిజన్ పరిఽధిలో 12 నేరాలు చేసినట్లుగా వెల్లడైంది. నడికుడి న్యూ పిడుగురాళ్ల, తుమ్మల చెరువు, దొనకొండ, అప్పికట్ల వద్ద జరిగిన నేరాలు, అదే విధంగా తుమ్మల చెరువు, నిడుబ్రోలు ప్రదేశాల్లో జరిగిన పోలీస్ కాల్పుల కేసులుగా వీటిని గుర్తించారు.
ఇంకా అరెస్ట్ కావల్సిన నిందితులు వీరే..


