చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ–న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఎన్ఐటీ ఢిల్లీ) మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు విద్యా, పరిశోధనా రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగనున్నాయని తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల కోసం ప్రయోగశాల సందర్శనలు, శాసీ్త్రయ సమాచారం, పరిశోధనా సామగ్రి మార్పిడి, సంయుక్త సదస్సులు, సెమినార్లు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు (ఎఫ్డీపీ), వర్క్షాప్ల నిర్వహణ చేపట్టనున్నారు. వర్చువల్ తరగతుల ద్వారా అతిథి అధ్యాపకుల ఉపన్యాసాలతో పాటు, ఫ్యాకల్టీ ఇమర్షన్ ప్రోగ్రామ్ (ఎఫ్ఐపీ) కింద అధ్యాపకుల పరస్పర మార్పిడికి అవకాశం కల్పించనున్నారు. ఈ అవగాహన ఒప్పందం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా విద్య, పరిశోధన, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత బలమైన వేదిక ఏర్పడనుందని వైస్ చాన్స్లర్ తెలిపారు. ఎన్ఐటీ ఢిల్లీ అధ్యాపకులు, విజ్ఞాన్ డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.


