పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా జిల్లా పరిషత్ల ఏర్పాటు
ఉమ్మడి
జిల్లా పరిషత్
స్వరూపమిదీ..
సెప్టెంబర్ 24న ముగియనున్న
పాలకవర్గ పదవీకాలం
1964 నుంచి మనుగడలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్
ఈఏడాది జనవరి ఓటర్ల జాబితా
ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొదలైన జెడ్పీ ఎన్నికల హడావుడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ ఇక గతంగా మారనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్ను విభజించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో జెడ్పీ స్వరూపం మారనుంది. దశాబ్దాల తరబడి ఉమ్మడి గుంటూరుగా కొనసాగుతున్న జెడ్పీ ఇకపై మూడు ముక్కలుగా విడిపోనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పల్నాడు, బాపట్ల జిల్లాలు విడిపోయాయి. మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో వాటిని అందిపుచ్చుకునేందుకు పాలకవర్గాలు కచ్చితంగా ఉండాల్సిన అవసరముంది. లేకుంటే నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రజా పరిషత్లకు పదవీకాలం ముగియనుండటంతో వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ జెడ్పీలతోపాటు గుంటూరు జిల్లాలోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాగా కలిసి ఉన్న జెడ్పీ కొత్త జిల్లాల ప్రాతిపదికన విడిపోనుంది.
ఏర్పాట్లలో ఎన్నికల సంఘం
ఇప్పటి వరకు 57 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని పరిస్థితుల ఆధారంగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికలకు సిద్ధమవుతూ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మండలాల వారీగా ఓటరు జాబితాల రూపకల్పన, రిజర్వేషన్ ప్రకారం వార్డులు, గ్రామాలు, మండలాలను కేటాయించేందుకు కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)తో సంబంధం లేకుండా 2026 జనవరి 1న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో వార్డు, గ్రామ, మండల స్థాయిలో ఓటర్లను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్ల రిజర్వేషన్ కేటాయింపుకు ఇదే కీలకం కానుంది.


