లక్ష్మీపురం: యోగాంధ్ర రిజిస్ట్రేషన్ పేరుతో సచివాలయాల నుంచి ఫోన్ కాల్స్ చేసి ఓటీపీలు అడుగుతుండటంతో నగర వాసులు సైబర్ నేరాలకు ఎక్కడ గురవుతామోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా, నగరపాలక సంస్థ అధికారుల సూచన మేరకు గుంటూరు నగర వాసులకు సచివాలయాల ఉద్యోగులు ఓటీపీ చెప్పాలని ఫోన్ కాల్ చేస్తున్నారు. ఒక పక్క ఓటీపీలు చెబితే చాలు ఖాతాల్లోని రూ.లక్షల నగదు మాయం అవుతున్న రోజులివి. ఇప్పుడు యోగాంధ్రా కోసం సచివాలయాల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, దానికి సంబంధించి మీ సెల్ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చిందని సచివాలయ సిబ్బంది నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొంత మంది చెప్పినప్పటికీ చాలామంది భయంతో వెనుకడుగు వేస్తున్నారు. అయినప్పటికీ పదే పదే కాల్స్ చేస్తుండటంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని సచివాలయాల నుంచి కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తుండటంతో ఇదే నమోదు అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. నమోదు చేస్తున్నట్లు చెప్పకుండా నేరుగా ఓటీపీ చెప్పమని అడుగుండటంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కారణంగానే సంబంధిత అధికారుల ఆదేశాలతో సచివాలయ సిబ్బంది ఇలా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


