గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలకు డిజిటల్ వ్యూహాలు రూపొందిస్తూ సోషల్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిరాజ్ సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ పొలిటికల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్– 2026‘ పురస్కారం ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా సిరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎన్. సురేష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు.
స్టీలు బ్రిడ్జి పనులు ప్రారంభం
తాడేపల్లి రూరల్: రాజధాని ముఖద్వారమైన ప్రకాశం బ్యారేజ్ సమీపంలో బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి గతంలో స్వల్పంగా ఒరగడంతో ఆ బ్రిడ్జిలో కొంత భాగాన్ని సీఆర్డీఏ అధికారుల సూచనల మేరకు తొలగించారు. ఆ గడ్డర్లను సరిచేసి బకింగ్హామ్ కెనాల్పై అమర్చేందుకు కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి పనులు ప్రారంభించారు. మొత్తం నాలుగు ఐరన్ గడ్డర్లు బిగించాల్సి ఉండగా సాయంత్రం సమయానికి మూడు గడ్డర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. మరో గడ్డర్ను అమర్చి దానిపై కాంక్రీట్ వేసేందుకు ప్రత్యేకమైన రేకులు, స్టీలును అమర్చాల్సి ఉంది. 10–15 రోజుల్లో స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు పలువురు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రాచీన యుద్ధకళ కర్రసాము పోటీల్లో నగరానికి చెందిన కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చీఫ్ కోచ్ కాశీనాఽథ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించి మరోసారి అకాడమీ పేరు నిలబెట్టారన్నారు. ఐదుగురు సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 21న తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే జాతీయస్థాయి కరస్రాము పోటీలకు అర్హత సాధించారన్నారు. క్రీడాకారులను ఎస్ఐ విజయ్కుమార్, సక్సెస్ స్కూల్ డైరెక్టర్ బి.సాయి మల్లికార్జున్, అకాడమీ అధ్యక్షులు వెంకట రమణతోపాటు పలువురు అభినందించారన్నారు.


