బాపట్లటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని డీఆర్ఓ జి.గంగాధర్గౌడ్ తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 7వ తేదీ నుంచి 21 వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానిలో భాగంగా ఆదివారం జిల్లా కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాలు ప్రారంభించారు. డీఆర్ఓ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందవచ్చన్నారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపదన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ పి.గ్లోరియా, నోడల్ ఆఫీసర్ చంద్ర శేఖర్, డీపీఓ ప్రభాకరరావు, డీఎస్డీఓ శ్రీనివాసులు, పశు సంవర్ధక శాఖ జె డి.వేణుగోపాల్, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, సమాచార శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ పి.వెంకట్రమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, బి.సి సంక్షేమ, సాధికారత అధికారిణి శివలీల పాల్గొన్నారు.
తెనాలిరూరల్: ఉరి వేసుకుని తాపీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ గంగానమ్మపేటకు చెందిన పఠాన్ చాన్బాషా(37) తాపీ పనులకు వెళుతుంటాడు. మద్యం తాగి వచ్చి తరచూ భార్య, పిల్లలతో ఘర్షణ పడి కొడుతూ ఉంటాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వచ్చి ఘర్షణ పడుతుండడంతో భార్య పక్క ఇంటికి వెళ్లింది. గదిలోకి వెళ్లిన అతను నైలాన్ తాడుతో ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్తె కిటికీలో నుంచి చూసి చుట్టుపక్కల వారికి చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని దింపి, వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


