గుంటూరు రూరల్: మద్యం మత్తులో ఈతకు వెళ్లి వాచ్మెన్ మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మధుపవన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్యామలానగర్ సీతమ్మకాలనీ సమీపంలో అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న బొబ్బుల ప్రసాద్ (35) అదే కాలనీలో పలు అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా పనిచేస్తున్న తన స్నేహితులైన బొడ్డుపల్లి బ్రహ్మయ్య, మరో ఇద్దరుతో కలిసి ఆదివారం మద్యం సేవించేందుకు వెంగళాయపాలెం సమీపంలోని కాలువ వద్దకు చేరారు. మద్యం సేంచి సమీపంలోని కాలువలో ఈతకు వెళ్లారు. అనంతరం నలుగురు మరలా మద్యం సేవించేందుకు పక్కనే ఉన్న ఫ్లాట్లులోకి వెళ్ళారు. మిగిలిన ముగ్గురు మద్యం సేవిస్తుండగా ప్రసాద్ తాను మద్యం సేవించనని ఈతకొడుతూ ఉంటాను మీరు రండి అంటూ మరలా కాలువలో ఈతకు దిగాడు. మద్యం సేవించిన మిగిలిన ముగ్గురు కాలువ వద్దకు చేరి చూడగా ప్రసాద్ కనిపించలేదు. చుట్టు చూసి కాలువలో వెతకగా కొంతదూరంలో ప్రసాద్ మృతదేహం కాలువలో కనిపించింది. దీంతో ముగ్గురు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


