తాడికొండ: పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు, సహజ వనరులను సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. తుళ్లూరు మండలం ఐనవోలులోని విట్– ఏపీ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ పోటీలకు శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ విద్యుత్ వాహనాలు, సైకిళ్ల వినియోగం పెంచడంతోపాటు మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. సచివాలయం నుంచి ఆమె ఎలక్ట్రిక్ బైక్పై ప్రయాణించి విట్కు చేరుకొని పర్యావరణ పరిరక్షణ పట్ల తనకున్న నిబద్ధతను చాటారు. కార్యక్రమంలో విఐటి– ఏపీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పి అరుళ్ళోళి వర్మన్, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ సత్యన్నారాయణ, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డాక్టర్ ఖాదిర్ భాషా, ఏపీ చెస్ అసోసియేషన్ చైర్మన్ కెవివి శర్మ, అధ్యక్షులు డాక్టర్ సురేష్, కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


