లక్ష్మీపురం: గుంటూరు జిల్లా సర్వే శాఖ సహాయ సంచాలకులుగా సజ్జ వెంకటేశ్వరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లాలో సర్వే ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై గుంటూరు సహాయ సంచాలకులుగా నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మను ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. జిల్లాలో సర్వే, రీ సర్వే పనులు విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, సర్వే శాఖ ఉపసంచాలకులు పాల్గొన్నారు.
వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల రిజిస్ట్రేషన్ గడువు పెంపు
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్, గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు, మూడు సంవత్సరాల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాకేంతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు గడువు తేదీని ఈనెల 22వ తేదీ వరకూ పొడిగించినట్లు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ వయస్సు 15 సంవత్సరాలు పూర్తయ్యి ఉండాలనే నిబంధనలు సవరించారని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా ఈ కోర్సులకు ప్రవేశాలకు అర్హులేనని తెలిపారు. మరిన్ని వివరాలకు www. angrau. ap. in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
వీవీఐటీయూను సందర్శించిన సింగపూర్ విద్యార్థులు
పెదకాకాని: సింగపూర్కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ మిలనీ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివా, వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని వీవీఐటీయూ ప్రో–ఛాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండల పరిధిలోని వర్సిటీలో గురువారం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక సమ్మేళనంలో భాగంగా ఐదు రోజుల పర్యటనకు విచ్చేసిన సింగపూర్ విద్యార్థులు బహుళ సాంస్కృతిక అవగాహన, విద్యావిధానం, సాంకేతికత, సమస్యా పరిష్కారానికి మానవీయ కోణంలో ఆలోచించి డిజైన్ థింకింగ్ పద్ధతిలో పరిష్కారాలను కనుగొనడం వంటి అంశాల అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారని ఆయన వివరించారు. వీవీఐటీ విద్యార్థులతో కలిసి సింగపూర్ విద్యార్థులు విషయ విశ్లేషణ (గ్రూప్ డిస్కషన్) నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ సింగపూర్ కళాశాల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, టీఎల్సీ హెడ్ డాక్టర్ రావెల నవీన్, అధ్యాపకులు పాల్గొన్నారు.


