జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: అస్పృశ్యత, కుల వివక్ష, బాల్య వివాహాలు వంటి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఫులే చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫులే ఆలోచన విధానం నేటి విద్యావ్యవస్థ బలోపేతానికి, బాలికా విద్య పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టడానికి దోహదం చేశాయన్నారు. సమాజంలో దురాగతాలను రూపుమాపేందుకు బాటలు వేసిన మహనీయుడన్నారు.


