విద్యుత్ అదాలత్లతో సమస్యల పరిష్కారం
కొరిటెపాడు(గుంటూరు): ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఉన్న ఏడు సర్కిల్స్లో అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కన్జూమర్ గ్రీవెన్సె రెడ్రస్సెల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) పనిచేస్తోందని సీజీఆర్ఎఫ్ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ తెలిపారు. గుంటూరు–పొన్నూరు రోడ్లోని విద్యుత్ శాఖ సమావేశ మందిరంలో మంగళవారం విద్యుత్ అదాలత్ జరిగింది. అదాలత్లో 20 మంది విద్యుత్ వినియోగదారులు వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వాటిలో 19 మంది సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా విక్టర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ఒంగోలు, పల్నాడుతో పాటు సీఆర్డీఏ సర్కిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సర్కిళ్ల పరిధిలో ఉన్న వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీజీఆర్ఎఫ్ పని చేస్తోందన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ వినియోగదారుల అదాలత్లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఐదు సమస్యలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, మిగిలిన వాటిని పరిష్కరించామని వెల్లడించారు. కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు డి.కృష్ణనాయక్, ఆర్థిక సభ్యులు కె.కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ.సునీత, గుంటూరు పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్


