వీసిని నియమించినా..
17 నెలలుగా వారిదే ఆధిపత్యం...
ఏఎన్యూ (పెదకాకాని): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) అద్దం పడుతోంది. రాజధాని ప్రాంతంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పొందిన ర్యాంకులే విద్యావ్యవస్థపై పాలకుల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. వర్సిటీలోని వివిధ విభాగాల్లో ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకూ బోధన, పరిశోధన అంశాలలో మెరుగైన శిక్షణ, అడ్మినిస్ట్రేషన్ ఆధారంగా ర్యాంక్లను కేంద్రం కేటాయిస్తుంది. కొందరు ఇన్చార్జులు పాఠాలు చెప్పడం మాని ఆర్థిక వ్యవహారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన విద్యాబోధన కుంటుపడింది. ఉమ్మడి గుంటూరుకే ప్రభుత్వ ఉన్నత విద్యాకేంద్రమైన విశ్వవిద్యాలయం ఇన్చార్జుల పాలనలో నానాటికీ దిగజారుతోంది. ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ట కలిగిన ఈ విశ్వవిద్యాలయంలో ఇన్చార్జులతో జవాబుదారీతనం లోపిస్తున్నా పట్టించుకునే వారు లేరు. సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఏఎన్యూ ఉంది. దాదాపు 17 నెలల నుంచి ఇదే తంతు కొనసాగుతున్నా దృష్టి సారించలేదు.
రాష్ట్ర గవర్నర్ ఏఎన్యూకి నూతన వీసీగా ఆచార్య ఎస్వీ సత్యన్నారాయణరాజును అక్టోబరు 8న నియమించారు. నెలలు దాటినా ఇప్పటికీ బాధ్యతలు చేపట్టలేదు. త్వరలో బాధ్యతలు స్వీకరిస్తున్నారని, వీసీ రాకుండా పైరవీలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీ అభివృద్ధి పనులు, నిధులు, సాంకేతిక పరమైన అంశాలు.. ఇలా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తాము ఇన్చార్జులం మాత్రమే అని చెబుతూనే వారి సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రం కాంట్రాక్ట్, ఆనరరీ ప్రొఫెసర్, కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు చేస్తూనే ఉన్నారు. రిటైర్డ్ అయిన నాలుగేళ్ల తరువాత కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి ఉద్యోగాలు కట్టబెట్టారు. విశ్రాంత ఉద్యోగులను నియమించగా, దాదాపు వారందరూ ఒకే సామాజిక వర్గం కావడం విశేషం. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నా పెన్షన్ తీసుకుంటున్న వారికి వేలల్లో వేతనాలు ఇచ్చి ఉద్యోగ నియమకాలు చేపట్టారు. లోటు బడ్జెట్ పేరుతో సుమారు 145 మందిని విధుల నుంచి తొలగించిన ఇన్చార్జులు... ఆపై తిరిగి 40 మందిని వారి సామాజిక వర్గం నుంచి వివిధ పదవుల్లో నియమించడం గమనార్హం. వర్సిటీలో జరుగుతున్న పీజీ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యం.
15 మంది ఇన్చార్జ్లలో ఐదుగురు ఒకే సామాజిక వర్గం వారు. కీలక పోస్టులైన వీసీ, రెక్టార్లు కూడా వారే. 2024 జూలై నుంచి (రెక్టార్ మినహా) నేటి వరకు ఇన్చార్జుల పాలన కొనసాగుతోంది. తాత్కాలిక వీసీ తన సొంత విభాగంలోనే నిబంధనలకు విరుద్ధంగా బోధనేతర సిబ్బందిగా రిటైర్డ్ అయిన బొబ్బా బసవేశ్వరరావును కన్సాలిడేటెడ్ వేతనంతో అధ్యాపకుడిగా నియమించడంతో నాణ్యమైన బోధనకు ఆటంకం ఏర్పడింది. లెక్చరర్ అర్హత లేని వ్యక్తికి ఏకంగా గైడ్ షిఫ్ట్ ఇవ్వడం పట్ల పలువురు ఆచార్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 150 మందికి పైగా కాంట్రాక్ట్, అతిథి అధ్యాపకులు ఉన్నారు. బోధనేతర సిబ్బందికి సైతం ఇంతకంటే మంచి అర్హతలు ఉన్నాయి. కానీ ఆయనకే ఈ అవకాశం ఇచ్చి కారు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం తాత్కాలిక వీసీకే చెల్లిందని విద్యావేత్తలు చర్చించుకుంటున్నారు. విజిలెన్స్ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వర్సిటీకి నూతన వీసీ వచ్చేలా చూడాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, మేధావులు కోరుతున్నారు.
ఇన్చార్జుల పాలనలో దిగజారిన
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
ఎన్ఐఆర్ఎఫ్ ఓవరాల్ కేటగిరీలో
84, రాష్ట్ర వర్సిటీల్లో 24వ ర్యాంకు
145 మంది తొలగింపు.. కొత్తగా
40 మంది అయినవారి నియామకం
నూతన వీసీని నియమించి
రెండు నెలలు దాటినా బాధ్యతలు
చేపట్టని వైనం
పరీక్షల దగ్గర్నుంచి పాలనాపరమైన
పనుల వరకు అంతులేని నిర్లక్ష్యం
చంద్రబాబు సర్కారు హయాంలో
తీవ్రంగా నష్టపోతున్న విద్యార్థులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నానాటికీ దిగజారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నివిధాలుగా వర్సిటీని నాశనం చేస్తున్నారు. విద్యార్థులకు చదువులు చెపాల్సిన చోట అయినవారిని ఇన్చార్జులుగా అందలం ఎక్కించి అడ్డగోలు పనులు చేస్తున్నారు. దీంతో ఎన్నో ఆశలతో చేరిన విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు వర్సిటీ ప్రతిష్ట నానాటికీ మసకబారుతోంది.
వీసిని నియమించినా..


