కూటమి ఓవర్‌ యాక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి ఓవర్‌ యాక్షన్‌

Apr 25 2025 8:16 AM | Updated on Apr 25 2025 8:16 AM

కూటమి ఓవర్‌ యాక్షన్‌

కూటమి ఓవర్‌ యాక్షన్‌

ఫ్లయ్‌ ఓవర్‌కు మంగళం.. ఆర్‌ఓబీతోనే సరి !

సాక్షి ప్రతినిధి,గుంటూరు: గుంటూరు నగరానికి ఐకానిక్‌గా మారాల్సిన శంకర్‌ విలాస్‌ ఫ్లయ్‌ ఓవర్‌ను కూటమి నాయకులు చిన్న బ్రిడ్జిగా మార్చివేయడం వివాదంగా మారుతోంది. ప్రభుత్వంలో ఉన్నాం. మేం చెప్పినట్లే చేయాలి. మా ఆలోచనలే అమలు కావాలంటూ మొండిగా ముందుకెళుతుండడం ఆందోళన కలిగిస్తుంది. పైగా అడ్డుకుంటే పొక్లెయిన్లు వస్తాయంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో గల్లా జయదేవ్‌ ఎంపీగా ఉన్నప్పుడు, తాజాగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక కూడా ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మిస్తామని, అండర్‌ బ్రిడ్జి కూడా ఉంటుందని ప్రకటించి, ఇప్పుడు కేవలం చిన్న బ్రిడ్జికి పరిమితం చేశారు.

తూర్పు, పశ్చిమలకు అనుసంధానం..

శంకర్‌ విలాస్‌ సెంటర్‌ బ్రిడ్జిని 1960లో నిర్మించారు. అప్పడు గుంటూరులో చాలా తక్కువ జనాభా. ప్రస్తుతం గుంటూరు నగర జనాభా 11లక్షలకు చేరింది. రోజూ శంకర్‌ విలాస్‌ ఫ్లయ్‌ ఓవర్‌ మీదుగా లక్ష వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఎప్పుడో ఆరు దశబ్దాల క్రితం నిర్మించి ఈ బ్రిడ్జి కేవలం రెండు వరుసలు మాత్రమే. గుంటూరులో రోజురోజుకూ ట్రాఫిక్‌ సమస్య ఎక్కువవుతుంది. దాదాపు 30వేలకు పైగా ఆటోలున్నాయి. స్కూల్‌, కాలేజీ, యూనివర్సిటీ బస్సులు వెయ్యివరకూ ఉన్నాయి. ఇక కార్లు, టూవీలర్స్‌ అయితే చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పటినుంచో పెరుగుతున్న ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా శంకర్‌ విలాస్‌ ఫ్లయ్‌ ఓవర్‌ స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌ ఉంది. ప్రధానంగా శంకర్‌ విలాస్‌ ఫ్లయ్‌ ఓవర్‌ గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉంటుంది.

బిల్డప్‌ కోసం జనం బలి!

2014లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్‌ వద్ద శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మించాలని జనం డిమాండ్‌ గట్టిగా వినిపించారు. దీంతో జయదేవ్‌ 2017లో పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. సింగిల్‌ పిల్లర్‌తో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగేలా డిజైన్‌ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.167కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి హిందూ కాలేజీ సెంటర్‌ వరకూ 1.46 కి.మీ బ్రిడ్జి నిర్మించాలని డిజైన్‌ చేశారు. అయితే ఆ ప్రతిపాదన కాగితాలకే పరిమితమయ్యింది. వైఎస్సార్‌ సీపీ పాలనలో శంకరవిలాస్‌ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ కూడా కేంద్రానికి పంపారు. నిధులు మంజూరయ్యే సమయానికి ప్రభుత్వం మారిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేతుబంధన్‌ పథకం కింద కేంద్రం శంకర్‌ విలాస్‌ బ్రిడ్జికి రూ.98కోట్లు మాత్రమే మంజూరు చేసింది. వాస్తవానికి 2017లోనే బ్రిడ్జి నిర్మాణానికి రూ.167కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేస్తే పెరిగిన రేట్లకు అనుగుణంగా ఇప్పుడు దాదాపు రూ.200కోట్లు ఖర్చు అవుతుంది. కానీ గుంటూరు ఎంపీ పెమ్మసాని తామేదో చేసేస్తున్నామని బిల్డప్‌ ఇవ్వడానికి సేతుబంధన్‌ పథకం కింద పెట్టి కేవలం రూ.98కోట్లు మంజూరు చేయించారు. నిధులు సగానికిపైగా తగ్గిపోవడంతో పూర్తిగా డిజైన్‌ మార్చేసింది.

930 మీటర్లు మాత్రమే..

గతంలో 1.46 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మించాలని డిజైన్‌ లో ఉంటే ప్రస్తుత డిజైన్‌ లోమాత్రం కేవలం 930 మీటర్ల దూరం ఉండేలా డిజైన్‌ చేశారు. దీంతోపాటు గతంలో ఆరులైన్ల డిజైన్‌ ఉంటే ప్రస్తుతం నాలుగు లైన్ల డిజైన్‌గా మార్చేశారు. పాత డిజైన్‌ లో ఆర్‌ఓబితోపాటు ఆర్‌యూబి. కూడా ఉంది. ఇప్పుడు డిజైన్‌ మారిపోవడంతో సర్వీస్‌ రోడ్లు కూడా చిన్నవిగా డిజైన్‌ చేశారు. కొత్త డిజైన్‌ను ప్రజలు, వ్యాపారస్థులు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. రాజధానికి వెళ్లే బ్రిడ్జి మరో 50ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉండాలే తప్ప మాకు వచ్చిన నిధులతోనే నిర్మిస్తాం... సరిపెట్టుకోమంటే మంచి పద్ధతి కాదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాత డిజైన్‌ ప్రకారమే నిర్మించాలి

కొత్త బ్రిడ్జి డిజైన్‌ పై నగరవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కోరుకున్నట్లు హిందూ కాలేజీనుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకూ ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మాణం చేపట్టాలి. మంజూరైన నిధులతోనే కొత్త డిజైన్‌ ప్రకారం బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పడం సరికాదు. నగర ప్రజల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేం ఉద్యమిస్తుంటే మాపై బురద జల్లాలని చూస్తున్నారు. నగర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టడాన్ని మేం అంగీకరించం. నగరంలోని 11 లక్షల జనాభా సౌకర్యార్థం బ్రిడ్జి డిజైన్‌లో సవరణలు కోరుతున్నాం నిధులు సరిపోకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు నిధులు సమీకరించి ఐకానిక్‌ బ్రిడ్జితోపాటు ఆర్‌యూబీ కూడా నిర్మించాలి.

– ఎల్‌ ఎస్‌ భారవి,

బెటర్‌ శంకర్‌విలాస్‌ ఫ్లయ్‌ ఓవర్‌ జేఏసీ

భవిష్యత్‌ అవసరాలకు సరిపోని డిజైన్‌ శంకర్‌విలాస్‌ ఫ్లయ్‌ ఓవర్‌పై వివాదం 2018లో రూ.168 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు నేడు సేతుబంధన్‌ ప్రాజెక్టు కింద రూ.98 కోట్లతో సరి వ్యతిరేకిస్తున్న గుంటూరు నగరవాసులు అడ్డుకుంటే పొక్లయిన్లు వస్తాయంటూ ఎమ్మెల్యే బెదిరింపులు

ఆర్‌యూబీకి అవకాశమున్నా.. దృష్టిపెట్టని వైనం

మొదట హిందూ కళాశాల కూడలి నుంచి లాడ్జి సెంటర్‌ వరకు ఐకానిక్‌ ఫ్లయ్‌ ఓవర్‌, కింద ఆర్‌యూబీ, సర్వీసు రోడ్లు కనీసం 30 అడుగుల వెడల్పుతో ఉండేలా డిజైన్‌ చేశారు. 2018లోనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.167 కోట్ల అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని కేంద్రమంత్రితో సేతుబంధన్‌ ప్రాజెక్టు కింద ఆమోదింపచేయడంతో కేవలం రూ. 98 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. ఫ్లయ్‌ ఓవర్‌ కాస్తా బ్రిడ్జిగా మారిపోయింది. ఆర్‌యూబీ కూడా సాంకేతికంగా సాధ్యం కాదని చెబుతున్నారు. వాస్తవానికి అధికారపార్టీ చెబుతున్న వాదనలో వాస్తవం లేదు. విజయవాడ సింగ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఫ్లయ్‌ ఓవర్‌ ఉన్న చోట కూడా తర్వాత అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌యూబీలను మంజూరు చేశారు. రోజుకు కనీసం లక్ష వాహనాలు శంకర్‌విలాస్‌ బ్రిడ్జిపై నడుస్తాయని ఆరేళ్ల క్రితం చేసిన ట్రాఫిక్‌ స్టడీలోనే తేలింది. ఫ్లయ్‌ ఓవర్‌ను మంజూరు చేయించాల్సిన చోట తక్కువ బడ్జెట్‌లో బ్రిడ్జిని మంజూరు చేయించి, ఇప్పుడు తాము చెప్పినట్లే అందరూ వినాలనే ధోరణిలో వారు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement