స్నేహం ముసుగులో కీచకుడు | - | Sakshi
Sakshi News home page

స్నేహం ముసుగులో కీచకుడు

Dec 10 2024 1:57 AM | Updated on Dec 10 2024 1:33 PM

-

స్నేహితుడు తల్లిపై అత్యాచారయత్నం

 అరగంట సేపు పెనుగులాడిన

 బాధితురాలు పలుచోట్ల గాయాలు

 పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

తాడేపల్లి రూరల్‌ : మద్యం మత్తులో స్నేహితుడు తల్లిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రాంతంలో బాధితురాలు (50) ఉంటోంది. అక్కడే నివాసముండే తెంపర్ల రామారావు పలుమార్లు స్నేహితుడు ఇంటికి వెళ్లి బాధితురాలు అయిన అతడి తల్లితో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమె చేసిన వంటలు తిని బాగున్నాయి అమ్మా ! అంటూ పొగిడేవాడు. ఈ చనువుతో రామారావు మనసులో దురుద్దేశం పెట్టుకుని సోమవారం తెల్లవారుజామున స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. 

ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. తలుపు తీయమని అడగడంతో తెలిసిన వ్యక్తి కదా బాధితురాలు తలుపు తీసింది. ఒక్కసారిగా రామారావు ఆమెను మంచంపై పడవేసి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో అరవొద్దు అంటూ నోరు మూసి, దుస్తులను చించేందుకు ప్రయత్నించాడు. ఆ పెనుగులాటలో బాధితురాలికి పలుచోట్ల గాయాలయ్యాయి. చివరకు ఆమె అతడి నుంచి తప్పించుకుని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పరిగెత్తింది. ఆమె కేకలకు స్థానికులు రోడ్డుమీదకు రావడంతో రామారావు పరారయ్యాడు. బాధితురాలి బంధువులు రామారావు ఇంటికి వెళ్లి నిలదీయగా తమకు ఏమి తెలియదని సమాధానం చెప్పారు. 

దీంతో జరిగిన సంఘటనపై బాధితురాలు బంధువులతో కలసి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రామారావును ఎట్టకేలకు గుర్తించారు. అతడు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులతో సెటిల్‌మెంట్లు చేయించుకున్నట్లు సమాచారం. రామారావు తాడేపల్లిలో ఉన్న పలువురు జేబుదొంగల వెంట తిరిగి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాడని పలువురు తెలియజేశారు. రామారావు లాంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ బంధువులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement