విశ్రాంత స్వాంతుడు.. | The Special Bhakti Guest Column Story Written By Bhattu Venkata Rao | Sakshi
Sakshi News home page

విశ్రాంత స్వాంతుడు..

Jun 30 2026 8:27 AM | Updated on Jun 30 2026 8:27 AM

The Special Bhakti Guest Column Story Written By Bhattu Venkata Rao

జ్యోతిర్మయం

దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.

మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.

కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్,
    సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!

మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement