ఇప్పటివరకు మనం ఎన్నో భయంకరమైన కథలుగానీ, ప్రదేశాలను గురించి వినుంటాం. వాటిలో జైళ్లు కూడా ఒకటి. ఇక వీటిలో ఉండే శిక్షలగురించైతే చెప్పనవసరంలేదు. మరి ఈ జైళ్లు నేటికి ఉన్నాయా? లేవా? ఖైదీలకు ఎలాంటి శిక్షలు అమల్లో ఉండేవి అనే విషయాలగురించి తెలుసుకుందాం.
1. అల్కాట్రాజ్ ఫెడరల్ జైలు..
ఈ జైలు అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ జైళ్లలో ఒకటి. ఇది అల్కాట్రాజ్ ద్వీపంపై శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలో ఉంది. ఇదొక ద్పీపంపై ఉన్నందున జైలు నలువైపులా చల్లని నీరుతో కూడుకుని ఉంది. జైలులో గస్తీ టవర్లు, ఇనుప తలుపులు, కఠిన పర్యవేక్షణ ఉండేది. ఆనాడు నియమాలను వ్యతిరేకించిన ఖైదీలను ప్రత్యేక నిర్బంధ గదులలో ఉంచేవారు. ఈ గదులను ది హోల్ అని పిలిచేవారు. అయితే, కొన్ని గదుల్లో ఖైదీలను పూర్తిగా చీకటిలో రోజులు తరబడి అలాగే ఉంచేవారు.
1962 లో ఫ్రాంక్ మొర్రిస్, జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్ అనే ఖైదీలు ఈ జైలునుంచి పారిపోవడానికి చెంచాలు, సాధారణ పనిముట్ల సాయంతో జైలుగోడలనే తవ్వారు. అలా అక్కడినుంచి పారిపోయినవారి అచూకి ఇప్పటికీ లభించలేదు. అయితే ఈ జైలు ఏర్పడకముందు ఇదొక సైనిక కోటగా ఉండేది. తరువాత సైనిక జైలుగా మార్చారు. తప్పించుకోవడానికి కూడా వీలులేని ఈ జైలు బయటికి రావడమనేది అప్పట్లో ఒక అద్భుత విషయం. ప్రస్తుతం ఈ అల్కాట్రాజ్ జైలును నేషనల్ పార్క్ సర్వీసు ఆధ్వర్యంలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా నడుపుతున్నారు.
2. సెల్యులర్ జైలు..
భారత స్వతంత్ర పోరాట సమయంలో అత్యంత ముఖ్యమైన జైళ్లలో ఇది ఒకటి. ఇది అండమాన్-నికోబార్ దీవుల రాజధాని అయినటువంటి పోర్ట్ బ్లైర్ లో ఉంది. ఈ జైలును సాధారణంగా కాలాపానిగా పిలిచేవారు. బ్రిటీషు పాలన సమయంలో భారత స్వాతంత్ర సమరయోధులను దూరంగా పంపి బంధిచడానికి 1896-1906 సంవత్సర మధ్యకాలంలో దీని నిర్మాణం జరిగింది.
ఈ జైలులో 7 రెక్కలు ఉండేవి. మధ్యలో గోపురంగా ఉండి జైలు మొత్తంపై దృష్టి పెట్టేలా ఉంటుంది. ఇందులో కొన్ని వందల ఒంటరి గదులు ఉండి, ఖదీలను ఒక్కోగదిలో ఒక్కొక్కరిని ఉంచేవారు. అలా దీనికి సెల్యూలర్ జైలు అని పేరు వచ్చింది. ఖైదీలను సంవత్సరాల తరబడి జైలులో ఒంటరిగా ఉంచి, కఠిన శిక్షలను అమలుచేసేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్మారక చిహ్నంగా మారింది.
3. ఎస్-21 జైలు..
కంబోడియా రాజధాని ప్నోమ్ పెన్ లోని టుయోల్ స్లెంగ్ జనుసైడ్ మ్యూజియంలో ఉన్న ఒక భవనమే ఈ ఎస్-21 జైలు. కంబోడియా చరిత్రలోనే అత్యంత భయానకమైన నిర్బంధ కారాగారం ఇది. 1975లో ఖ్మేర్ రూజ్ అధికారంలోకి వచ్చాక ఈ జైలును నిర్మించారు. ఆనాటి ప్రభుత్వ వ్యతిరేకులను, శత్రువులను ఇందులో బంధించి చిత్రహింసకు గురిచేసేవారు.
తప్పుడు నేరాలు అంగీకరించేలా ఒత్తిడి చేసి, మరణశిక్షను కూడా అమలుచేసేవారు. మరణశిక్ష అమలు అయిన వారిని కిల్లింగ్ ఫీల్డ్స్ కు తీసుకెళ్లి చంపేవారు. జనవరి 1979 లో కంబోడియా-వియత్నాం యుద్ధంలో వియత్నాం దళాలు ఫ్నామ్ పెన్లోకి ప్రవేశించడంతో ఖ్మేర్ రూజ్ పాలనకు, ఈ జైలు శిక్షలకు ముగింపు పడింది. చివరికి ఈ ప్రదేశాన్ని 1980లో మ్యూజియంగా మార్చారు. ఈ ఎస్-21 జైలును భారతదేశంలోని కాలాపాని జైలుతో పోలుస్తారు.
4. బ్లాక్ డాల్ఫిన్ జైలు..
రష్యాలోని అత్యంత కఠినమైన కారాగారాల్లో ఇది కూడా ఒకటి. దీనికి ఐకే-6 అని అధికారికంగా పేరు ఉంది. ఇది కజకస్తాన్ సరిహద్దుకు సమీపంలో సోల్-ఇలెట్స్క్ ప్రాంతంలో ఉంది. దీనిని 18వ శతాబ్దం నుంచే కారాగారంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉగ్రవాద నేరస్తులు, హత్యలు, హింసాత్మక నేరాలు చేసిన వారిని బంధించేవారు. ఖైదీ ఉన్నటువంటి గదికి వివిధ రకాల భద్రతా తలుపులు ఉండేవి.
ఖైదీల కదలికపై తీవ్రమైన నియంత్రణను పాటించేవారు. ఈ జైలులోని ప్రధాన ప్రవేశం వద్ద ఖైదీలు తయారుచేసినటువంటి నల్ల డాల్ఫిన్ విగ్రహం ఉండటంతో బ్లాక్ డాల్ఫిన్ జైలుగా పేరు వచ్చింది. ఇది నేటికి పనిచేస్తున్నటువంటి కారాగారాలలో ఒకటి. నేడు పనిచేస్తున్న కఠిన శిక్షా వ్యవస్థకు ఈ జైలు ఒక ఉదాహరణ.
5. లా సబనెటా జైలు..
వెనిజులాలోని మరకైబో ప్రాంతంలో అత్యంత భయంకరమైన జైలు ఇది. దీని నిర్మాణం 1958 సంవత్సరంలో జరిగింది. ఈ జైలులో ఖైదీలను బంధించగా.. చివరికి ఖైదీలే జైలును నిర్వహించే స్థాయికి వెళ్లింది. దీంతో ప్రభుత్వ నియంత్రణ చాలా బలహీనమవడంతో.. గ్యాంగ్ నాయకులే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
జైలు సామర్థ్యం దాదాపు 700 ఖైదీలకు మాత్రమే ఉండగా.. సుమారు 3,700 మందిని బంధించేవారు. అంటే సామర్థ్యానికి 5 రెట్లు ఎక్కువ అన్నమాట. ఆహారం, తాగునీరు, వైద్యసేవలు కొరతగా ఉండేవి. జైలులోని ఖైదీలు అక్రమ రవాణాతోపాటు, వారి వద్ద తుపాకులు, కత్తులు, మాదకద్రవ్యాలుండేవి. 1994లో భారీ అల్లర్లు చెలరేగి అగ్నిప్రమాదం జరగగా, 100 మందికిపైగా మరణించిట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 2013లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 16 మంది ఖైదీలు మరణించగా.. అదే సంవత్సరంలో అక్కడి ప్రభుత్వం జైలును మూసివేసింది.


