
ప్రస్తుత ఈద్ అల్–అధా (బక్రీద్) పండుగ నేపథ్యంలో పెటా మరోసారి జంతుహింస పై అవగాహన కల్పిచింది. ఇందులో భాగంగా నగరంలో నిత్యం అన్నదానం చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ సర్వ్ నీడీ సహకారంతో దావత్–ఎ–ఈద్ పేరుతో వేగన్ బిర్యానీ పంపిణీ చేశారు. స్వతహాగా వేగన్ అయినటువంటి ప్రముఖ సింగర్ జహ్రా ఎస్ ఖాన్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.
నీలోఫర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోని అన్నార్తులకు ప్రత్యేకంగా వడ్డించిన వేగన్ బిర్యానీ పంపిణీ చేశారు. ఏ మతమైనా కరుణను కోరుకుంటుందని, ఆయా మతపరమైన వేడుకల్లో జంతు వధ తప్పనిసరి కావాల్సిన అవసరం లేదని పెటా బృందం నినదించింది. జంతువులపై దయ, కరుణతో నిర్వహించే పండుగలకు మరితం ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు.
మనుషుల్లాగే జంతువులకూ..
జంతు రవాణా చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక జంతువులను ఇరుకైన ట్రక్కుల్లో లాక్కెళుతూ, వాటి ఎముకలు విరిగిపోయినా, ఊపిరాడక చనిపోయినా పట్టింపు లేకుండా హింస్తుండటం బాధాకరం. నేను గత నాలుగేళ్ల నుంచి వేగన్గా మారాను. జంతు సంరక్షణే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడంలో వేగన్ ఫుడ్ ఉత్తమమైనది.
ఫిట్గా ఉండటంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్లు, మధుమేహం, క్యాన్సర్, ఊబకాయం వంటి వ్యాధులకు దూరంగా ఉంచడంలో ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్యానికి కీలకమైనది. సినిమాల పరంగా మరో మూడు పెద్ద ప్రాజెక్టుల్లో భాగమయ్యాను, త్వరలో అవి విడుదల కానున్నాయి.
– జహ్రా ఎస్ ఖాన్
మంచి అనుభూతినిచ్చింది..
మహానగరంలో ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నాం.. కానీ ఈ రోజు వినూత్నంగా వేగన్ బిర్యానీ అందించడం మంచి అనుభూతినిచ్చింది. సమానత్వం, సేవ మనుషులకు మాత్రమే కాదు సాటి మూగజీవాలకూ వర్తిస్తుందనే విషయాన్ని పెటా తమ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంది. ఇది స్ఫూర్తినిచ్చే అంశం.
– గౌతమ్ కుమార్, సర్వ్ నీడీ వ్యవస్థాపకులు
(చదవండి: Dinner: సాయంత్రం 6.30కి తినేయడమే మంచిదా? నటి కరీనా కపూర్ కూడా..)