
అమ్మపల్లి ఆలయానికి చారిత్రక గుర్తింపు
18వ శతాబ్దం నాటి విగ్రహాలుగా తేలి్చన పురావస్తు శాఖ
ప్రత్యేక ఆకర్షణగా ఎత్తయిన గోపురం
యేటా ఘనంగా నిర్వహిస్తున్న కల్యాణోత్సవాలు
శ్రీ సీతారాముల కల్యాణానికి నగరం నలుమూలలా ఉన్న రామాలయాలు ముస్తాబయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఆలయం ‘అమ్మపల్లి’ దేవస్థానం. ఏకశిలా రాతి విగ్రహంతో.. దశావతారంలో మకర తోరణం కలిగి శ్రీ సీతారామ లక్ష్మణులు ఇక్కడ కొలువయ్యారు. యేటా రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ శివారులోని అమ్మపల్లిలోని ఈ ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు ప్రశస్థి. ఇక్కడి ఆలయ, ప్రాకారాల నిర్మాణాల గురించి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలూ లేకపోయినా.. అప్పటి నిర్మాణ శైలి, విగ్రహ రూపాలను బట్టి 18వ శతాబ్దం నాటివిగా పురావస్తు శాఖ అంచనా వేస్తోంది.
నర్కూడలోని అమ్మపల్లి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో రెండు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహించారు. ఆదివారం ఉదయం 11.49 గంటలకు స్వామి కల్యాణం జరుగనుంది. భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయం చుట్టూ క్యూలైన్లు, ఇతర ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.
ఎత్తయిన ఆలయ గోపురం..
అమ్మపల్లి ఆలయానికి ఎత్తయిన గోపురం ప్రత్యేక ఆకర్షణ. సుమారు 80 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో ఈ గోపురం నిర్మితమైంది. ఆలయ గోపురం, ప్రాకారాలు చారిత్రక కళా నైపుణ్యాన్ని చాటి చెబుతాయి. ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, వెనకాల మరో కోనేరు ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఎదురుగా ఉన్న మంటపంలో యేటా శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు.
మంటప సమీపంలో నగారా, రథశాల ఉన్నాయి. శ్రీరామ లింగేశ్వర, శ్రీ ఆంజనేయస్వామి ఉప ఆలయాలు ఉన్నాయి.
గద్వాల్ సంస్థానం నుంచి విగ్రహాలు..
నిజాం దర్బార్లో వివిధ హోదాల్లో పని చేసిన రాజా భవానీ ప్రసాద్ భటా్నగర్ 1790లో దేవాలయం పనులను ప్రారంభించగా.. 1802లో విగ్రహ ఆవిష్కరణను కేరళకు చెందిన పూజారి వెంకటరమణాచారి, రాజా భవానీ ప్రసాద్ల నేతృత్వంలో గద్వాల్ సంస్థానం నుండి శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలను తీసుకొచ్చి అత్తాపూర్ రాంబాగ్లో విగ్రహా ప్రతిష్టాపన చేశారు. దీనికి మూడో నిజాం సికిందర్ జా ముఖ్య అతిథిగా హజరయ్యారు. నాటి నుంచి నేటి వరకూ వారి వారసులు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. 300 సంవత్సరాలు గల ఈ దేవాలయానికి భక్తులు అధికంగా వస్తుంటారు. భద్రాది రాములోరి కల్యాణం జరిగే సమయంలోనే అత్తాపూర్ రాంబాగ్ దేవాలయంలో అత్యంత వైభవంగా కల్యాణ ఉత్సవం ఆనవాయితీగా వస్తుంది.
అత్తాపూర్ రాంబాగ్లో..
అత్తాపూర్ : అత్తాపూర్ రాంబాగ్లోని చారిత్రాత్మక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కల్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. ఇప్పటికే దేవాలయాన్ని రంగులు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ మహోత్సవం, 7న దశమి రోజున రథోత్సవంతో పాటు లంకా దహనం, 8న సీతారామలక్ష్మణులకు దోపుసేవ, 9న వీధి సేవతో పాటు చక్రతీర్థం వంటి కార్యక్రమాలతో ముగుస్తాయని పూజారి తిరుమల దేశభక్త ప్రభాకర్, శ్రీనివాస్లు వెల్లడించారు.