
ముందస్తు ప్రసవాలతో పొంచి ఉన్న ముప్పు
నిలోఫర్ ఆస్పత్రిలో 50% ఇలాంటి కేసులే..
శిశువుల్లో ఊపిరితిత్తులు, కిడ్నీ తదితర సమస్యలు
సాక్షి, సిటీబ్యూరో: నెలలు నిండక ముందే శిశువుల జననం ఆందోళన కలిగిస్తోంది. నవ మాసాలు తల్లి గర్భంలో ఉండాల్సిన బిడ్డ.. అంతకుముందే భూమ్మీదకు వచ్చేందుకు ఆరాటపడుతుండటంతో ఫలితంగా పిల్లల్లో ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, ఇతర అవయవాలు పూర్తి స్థాయిలో వృద్ధి చెందకపోవడం, బరువు తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధానంగా ఆలస్యంగా వివాహం చేసుకోవడం, గర్భిణుల్లో రక్తపోటు, ఐవీఎఫ్ పద్ధతులు వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రతిరోజూ 40 ప్రసవాలు జరిగితే అందులో 20కిపైగా ప్రీ మెచ్యూర్ బేబీ కేసులు వస్తున్నాయి. అంటే దాదాపు 50 శాతం అన్నమాట.
ఎందుకిలా జరుగుతోంది..
ఉన్నత చదువులు చదవాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి. జీవితంలో స్థిరపడాలి. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ప్రస్తుత యువతలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఫలితంగా ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. దీనికి తోడు మారుతున్న జీవన శైలి, తినే ఆహారం, కాలుష్యం, వ్యాయామం లేకపోవడం, స్ట్రెస్, ఐవీఎఫ్ పద్ధతులు, ఇన్ఫెర్టిలిటీ తదితరాల కారణాలతో నెలలు నిండక ముందే ప్రసవాలకు (ప్రీ మెచ్యూర్ డెలివరీ) కారణమవుతున్నాయి. కనీసం రెండు కేజీలకుపైగా బరువు ఉండాల్సిన శిశువులు కేజీ, అంతకంటే తక్కువ బరువుతో జని్మస్తున్నారు. ఇలాంటి క్రిటికల్ కేసులను రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ప్రసవం క్రిటికల్గా మారితే వెంటనే నిలోఫర్కు రిఫర్ చేస్తున్నారని, ఇక్కడ మంచి వైద్యం అందుతోందని నమ్మకంతోనే వస్తున్నారని నిలోఫర్ ఆసుపత్రికి చెందిన వైద్యురాలు స్వప్న పేర్కొన్నారు.