ఉద్ధండ ఆర్టిస్టులు : ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే.. | Paropakar 2025 art exhibition in support of free education for underprivileged children. | Sakshi
Sakshi News home page

ఉద్ధండ ఆర్టిస్టులు : ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే..

Jun 20 2025 11:29 AM | Updated on Jun 20 2025 3:16 PM

Paropakar 2025 art exhibition in support of free education for underprivileged children.

నచికేత తపోవన్‌.. ‘పరోపకార’ ప్రదర్శన  

అనాథ పిల్లల విద్య కోసం నిధుల సేకరణ 

తోట వైకుంఠం, జోగెన్‌ చౌదరి, శక్తి బర్మన్, ఆలే లక్ష్మణ్, 

రమేష్‌ గోర్జాల వంటి ప్రముఖ ఆర్టిస్టుల కళాకృతులు 

వినూత్న కళా సేవా కార్యక్రమానికి శ్రీకారం  

సాక్షి, సిటీబ్యూరో: కళాకారుని సృజనాత్మకతకు మానవత్వం తోడైతే అద్భుతాలు సృష్టించ వచ్చని.. అది అనాథ, నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతుందని పలువురు కళాకారులు నినదిస్తున్నారు. ఇందులో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల విద్యకు సహకారం అందించడమే లక్ష్యంగా పరోపకార –2025 కళా ప్రదర్శన (Art Exhibition) నిర్వహించ నున్నారు. నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నచికేత తపోవన్‌ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల సమగ్ర విద్య, సాధికారత కోసం ప్రత్యేక నిధుల సేకరణ కళా కార్యక్రమంగా ‘పరోపకార–2025’ సగర్వంగా ఆవిష్కరిస్తున్నారు. కళ, లగ్జరీ రంగాల్లో వ్యాపారవేత్త అయిన సుష్మ తోట నిర్వహణలో నగరంలోని జూబ్లీ హిల్స్‌ ‘ది కులినరీ లౌంజ్‌’ వేదికగా ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. 

ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే.. 
నా పదేళ్ల అనుభవం.. నచికేత తపోవన్‌ కోసం ఈ పరోపకార– 2025 భారీ నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టేలా చేసింది. ఈ ఏడాది పరోపకార ఫండ్‌ రైజింగ్‌ ప్రధానంగా అనాథ, పేద, గిరిజన, మొదటి తరం విద్యార్థులకు ఉచిత విద్యపై దృష్టి సారిస్తోంది. పరోపకార 2025లో ప్రదర్శించే కళాఖండాల కొనుగోలు ద్వారా వచ్చే ప్రతి రూపాయి చిన్నారులు చదువుకోడానికి ఫీజులు, పుస్తకాలు, యూనిఫారŠమ్స్, ఆహారం అందించే నిధిగా వినియోగిస్తాం. కార్పొరేట్‌ సంస్థల కోసం ప్రత్యేకంగా ఎన్నో టీమ్‌ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాలను రూపొందించిన అనుభవం ఉంది.. కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఉన్నటువంటి సంతృప్తి, సంతోషం మరెక్కడా లభించదు. విద్య, ఆరోగ్యం అనేవి ప్రతి ఒక్కరి హక్కు.. కలిసొచ్చే అదృష్టం కాదు.  – సుష్మ తోట, నిర్వాహకులు. 

ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శన.. 

ఉచిత విద్య, సామాజిక సేవ లక్ష్యంతో సుష్మ తోట సంకలనం చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం.. కళను సమాజిక మార్పుకు నాంది పలికే విధంగా సరికొత్త లక్ష్యంతో మిళితం చేస్తుంది. ప్రఖ్యాత కళాకారులు తోట వైకుంఠం(Thota Vaikuntam), జోగెన్‌ చౌదరి, శక్తి బర్మన్, ఏలే లక్ష్మణ్(Laxman Aelay), రమేష్‌ గోర్జాల తదితరుల అద్భుతమైన కళాకృతులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్న చిన్నారుల ఆధ్వర్యంలో కూడా హృదయాన్ని హత్తుకునే ప్రదర్శనలు ఉంటాయి. ఈ వేదికగా రెండు రోజుల ప్రదర్శనలో ప్రసిద్ధ కళాకారులతో సమావేశాలు, విద్యార్థులతో సంభాషణలు ఉంటాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement