
ఆస్కార్, గ్రామీ అవార్డు విజేత... ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ ప్రేమ.. సేవ లక్ష్యంగా సాగుతున్న వన్ వరల్డ్.. వన్ ఫ్యామిలీ మిషన్లో భాగమయ్యారు. జూన్ 30న కర్నాటకలోని ముద్దెనహళ్లి సమీపంలో ఉన్న సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన ఆయన వన్ వరల్డ్-వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులుమధుసూదన్ సాయితో సమావేశయ్యారు. అనంతరం శ్రీ సత్యసాయి లోక సేవా గురుకులం విద్యార్థులు నిర్వహించిన సాయి సింఫనీని సద్గురుతో కలసి వీక్షించారు.
ఇది గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహిస్తున్న దేశంలోనే అతి పెద్ద సింఫనీ. సుమారు గంటన్నరసేపు సాగిన సింఫనీనీ ఆద్యంతం ఆస్వాదించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు నిర్వహించిన ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనను తన జీవితంలో ఇప్పటి వరకు చూడలేదంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. భవిష్యత్తులో దేశంలోనే అత్యుత్తమ సింఫనీగా ఎదిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయన్నారు. అంతే కాదు, వన్ వరల్డ్... వన్ ఫ్యామిలీ మిషన్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని, అలాగే శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు మరింత స్వాంతన కల్గించేందుకు ప్రత్యేకంగా హీలింగ్ మ్యూజిక్ను అందించేందుకు ముందుకొచ్చారు. ప్రపంచ మానవాళికి సేవలందిస్తున్న వన్ వరల్డ్.. వన్ ఫ్యామిలీ మిషన్కు తానిస్తున్న చిరు కానుక అని ప్రకటించారు ఎ ఆర్ రెహమాన్.