ఒక్క బిస్కట్‌కు లక్ష | Legal battle in consumer forum over biscuits | Sakshi
Sakshi News home page

ఒక్క బిస్కట్‌కు లక్ష

Jun 7 2026 5:45 AM | Updated on Jun 7 2026 5:45 AM

Legal battle in consumer forum over biscuits

దిలీప్‌ మాదిరెడ్డి

ఒకటి తక్కువైంది... ఒకటి తక్కువైంది... ఇదేదో సినిమాలో డైలాగ్‌ కాదు, నిజంగానే ఒకటి తగ్గింది. అయితే, ఇక్కడ తగ్గింది రెస్పెక్ట్‌ కాదు బిస్కట్‌. ప్యాకెట్‌లో పదహారు ఉండాల్సినవి పదిహేనే ఉన్నాయి. ఆ.. ఒకటే కదా? అని చాలా మంది ‘లైట్‌’గా తీసుకుంటారు. కానీ ఆ వ్యక్తి అలా భావించలేదు. తనకు ఒక్కటే. పదిమంది అయితే పది... వందమంది కొంటే వంద... అదే లక్షల్లో అయితే..? ఇలా ఆలోచించాడు. కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందన లేకపోవడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. వినియోగదారులు ఎలా నష్టపోతున్నారో వివరించాడు. న్యాయం చేయాలని అభ్యర్థించాడు. 

ప్యాకేజ్డ్‌ వస్తువులపై కొంతమంది ఎక్స్‌పైరీ డేట్, మరికొందరు రేట్‌ చూస్తారు. ఎక్కువ మంది ఇవేవీ పట్టించుకోరు. కావాల్సింది కొంటారు, తింటారు. బాగోకపోతే పడేస్తారు. ఇంకొందరు అలా కాదు, అన్నీ చూస్తారు. తేడావస్తే నిలదీస్తారు. అవసరమైతే న్యాయ పోరాటమూ చేస్తారు. వినియోగదారుడిగా తనకు ఉన్న హక్కును సాధిస్తారు. ఇలాంటి కోవకే చెందిన వ్యక్తి చెన్నైకి చెందిన ఢిల్లీబాబు.

అసలేం జరిగింది.. 
ఢిల్లీబాబు వీధి జంతువుల కోసం రెండు డజన్ల ‘మ్యారీలైట్‌’ బిస్కట్‌ ప్యాకెట్లు కొన్నాడు. రేపర్‌పై 16 బిస్కట్లు అని ముద్రించి ఉంది. కానీ ప్యాకెట్‌లో 15 మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని దుకాణ యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ‘తాను రిటైలర్‌నని వచ్చిన ప్యాకెట్లు అమ్మడమే తప్ప మిగతా విషయాలతో తనకు సంబంధం లేద’ని సమాధానమిచ్చాడు. మొత్తం బాధ్యత కంపెనీదే అని చెప్పాడు. దీంతో ఢిల్లీబాబు కంపెనీకి లేఖ రాశాడు. ఎటువంటి స్పందన రాలేదు.

ఫోరంలో ఫిర్యాదు
అతను అక్కడితో ఊరుకోలేదు. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. వినియోగదారుడు ఎంత నష్టపోతున్నాడో లెక్కలతో సహా వివరించాడు. ఒక్కో బిస్కట్‌ ధర 75 పైసలు పడింది. కంపెనీ సుమారుగా రోజుకు 50 లక్షల ప్యాకెట్లు ఉత్పత్తి చేస్తుందని అనుకుంటే, రూ. 29 లక్షల వరకు ప్రజల్ని మోసం చేసి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే నెలకు, సంవత్సరానికి? ఇలా రూ. కోట్లలో వినియోగదారులు నష్టపోతున్నారని వివరించాడు. 

కంపెనీ వాదన ఇలా..
బిస్కట్ల సంఖ్య కాకుండా బరువు ఆధారంగా విక్రయం జరుగుతుందని కంపెనీ వాదించింది. ప్యాకెట్‌ నికర బరువు 76 గ్రాములని, అదే ఆధారమని పేర్కొంది. దీంతో బిస్కట్‌ ప్యాకెట్‌ను తూకం వేయాలని ఫోరం ఆదేశించింది.. 74 గ్రాములే ఉంది. తూనికలు కొలతల శాఖ నియమాల ప్రకారం ప్యాక్‌ చేసిన వస్తువుల బరువు 4.5 గ్రాముల వరకు అటూ ఇటుగా ఉండొచ్చని కంపెనీ తరపు న్యాయవాదులు వాదించారు. 

ఈ వాదనను ఫోరం తిరస్కరించింది. కాలక్రమంలో బరువు తగ్గే వస్తువులకు ఆ నియమం వర్తిస్తుంది. రోజులు గడుస్తున్నా బిస్కట్‌ బరువులో ఎలాంటి మార్పు రాదని, అందువల్ల ఆ నియమం ఇక్కడ వర్తించదని ఫోరం తేల్చి చెప్పింది. బిస్కట్ల  సంఖ్యను ప్యాకెట్‌పై స్పష్టంగా ముద్రించినప్పుడు బరువు ఆధారంగా విక్రయిస్తామనే వాదన సరికాదని తోసిపుచ్చింది. 

రూ. లక్ష జరిమానా
ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని ఫోరం పేర్కొంది. ఫిర్యాదుదారు ఢిల్లీబాబుకు నష్టపరిహారం కింద రూ. లక్ష రూపాయలు, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 10 వేలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా పరిహారం చెల్లించకపోతే ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని పేర్కొంది. ఆ బ్యాచ్‌లో తయారు చేసిన బిస్కట్‌ ప్యాకెట్ల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. 

కొన్ని అంశాలు చిన్నవిగా అనిపించినా, ఎక్కువ మంది వినియోగదారులు మోసపోతే అది పెద్ద నష్టమే అవుతుంది. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటేనే వస్తువుల్లో నాణ్యత, పారదర్శకత పెరుగుతుందని ఈ కేసు స్పష్టం చేస్తోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే, చట్టం వినియోగదారుడికి రక్షణగా నిలుస్తోందని ఈ తీర్పు నిరూపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement