అత్యవసర ప్రయాణాల్లో భాగంగా టికెట్ కంటే అధిక డబ్బులు చెల్లించే ప్రయాణికుడికి.. కనీస సౌకర్యాలు కూడా దక్కకపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలి?. ఇలాంటి పరిస్థితి ఎదురైన ప్రయాణికుడు న్యాయం కోసం వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించాడు. తత్కాల్ టికెట్ ఉన్నా.. రాత్రంతా అతనికి నిద్ర లేకుండా చేసిన నేరానికిగానూ.. ఇండియన్ రైల్వేస్కు రూ.50 వేల జరిమానా విధించాల్సి వచ్చింది.
తత్కాల్ టికెట్ తీసుకున్న ఓ ప్రయాణికుడు.. తన ప్రయాణం సౌకర్యంగా సాగుతుందని భావించాడు. అయితే.. ఆ ప్రయాణంలో అతనికి భిన్నమైన అనుభవం ఎదురైంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు భారీ సంఖ్యలో అదే కోచ్లోకి రావడంతో కోచ్ కిక్కిరిసిపోయింది. కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడటమే కాకుండా.. రాత్రంతా నిద్ర లేకుండా గడపాల్సి వచ్చింది. ప్రయాణం మొత్తం తీవ్ర అసౌకర్యంగా మారడంతో.. వినియోగదారుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు.
ఘటనపై విచారణ జరిపిన తిరువనంతపురం జిల్లా(కేరళ) వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అతను అనుభవించిన మానసిక, శారీరక వేదనకు గానూ రూ.50 వేల పరిహారం చెల్లించాలని భారతీయ రైల్వేస్ను ఆదేశించింది. రిజర్వ్డ్ కోచ్లలో అనధికార ప్రయాణికులను నియంత్రించడం రైల్వేల బాధ్యత అని.. అది సరిగా జరగలేదు కాబట్టే అతను తనకు కేటాయించిన రిజర్వేషన్ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయాడని స్పష్టం చేసింది. అంతేకాదు.. అదనంగా న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.3 వేలు చెల్లించాలని సూచించింది.
రిజర్వేషన్ ఉన్నవారికి హక్కు ఉందని స్పష్టం
రైలు ప్రయాణాల్లో రిజర్వ్డ్ కోచ్లలో అనధికార ప్రయాణికుల సమస్య తరచూ తెరపైకి వస్తూనే ఉంటుంది. అయితే టికెట్ తీసుకున్న ప్రయాణికుడికి అందాల్సిన సేవలను నిర్లక్ష్యం చేయలేమని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది.


