అందాల పోటీలు అనగానే ఠక్కున సుస్మీతా సేన్, ఐశ్వర్యరాయ్ గుర్తొస్తారు. 1994 ఏడాదిలోనే రెండు ప్రతిష్టాత్మక టైటిల్స్ని ఈ ఇద్దరూ అందాల తారలు గెలుచుకుని భారత్కి గర్వకారణంగా నిలిచారు. కానీ వీరిద్దరి కంటే ముందే భారతదేశాన్ని ప్రపంచపటంపై నిలిపేలా భారతీయ హస్తకళల గొప్పతనాన్ని చాటిన మరొక అందాల తార ఉన్నారు. ఆమె గురించి మీకు తెలుసా అంటూ మిస్ ఇండియా ఆర్గనైజేషన్ అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేసింది. ఇంతకీ ఎవరా అందాల తార అంటే..
ఆ అందాల తార కర్మిందర్ కౌర్ విర్క్. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ భారతదేశం అంతర్జాతీయ కిరీటంను గెలుచుకునే స్వర్ణయుగానికి ముందే..భారతీయ హస్తకళా నైపుణ్యాన్ని ప్రపంచం గుర్తించేలా చేసిన ఒక అందాల రాణి ఉన్నారు అంటూ ఆమె గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది. "1993 మిస్ వరల్డ్లో, ఫెమినా మిస్ ఇండియా విజేత కర్మిందర్ కౌర్ విర్క్, అందంగా చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరతో ఉత్తమ జాతీయ దుస్తుల అవార్డును గెలుచుకున్నారు.
అనేక దుస్తులను ఆ రోజు అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్న తరుణంలో ఈ ముద్దుగుమ్మ కర్మిందర్ ఈ చీర కారణంగా భారతదేశం వేదికపై ప్రత్యేకంగా నిలవడం విశేషం. అంతేగాదు అంతమంది అందాల భామల డిజైనర్వేర్ల ముందు భారతీయ వారసత్వం, హస్తకళా నైపుణ్యం ప్రామాణికత ఎంత శక్తిమంతమైందో నిరూపితమైంది. మా అందాల పోటీల చరిత్రలో మర్చిపోయిన ఒక అధ్యయం, కానీ దానిని గుర్తుచేసుకున్నందుకు తాము గర్విస్తున్నాం." అని పోస్ట్లో పేర్కొంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్.
ఆమె ధరించిన చీర ప్రత్యేకత..
కర్మిందర్ ధరించిన చీర లెహంగా. భారత దేశపు రాజరిక వారసత్వానికి ప్రతీకగా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు. దట్టమైన జరీ, బ్రోకేడ్, అద్దాల పనితో కూడిన వస్త్రాలు. బరువైన చెవిపోగులు, ఉంగరాలు, నడుముకు కట్టిన పట్టి వంటి సాంప్రదాయ ఆభరణాలు జత చేయడంతో ఆ ప్రపంచ వేదికపై ఆమె రూపం ముగ్ధమనోహరంగా ఆవిష్కృతమైంది. ఈ వస్త్రాలను భారతీయ హస్తకళా నైపుణ్యాన్ని సాంస్కృతికతను ప్రదర్శించేలా అందంగా తీర్చిదిద్దారు.
ఎవరీమె..?
ప్రపంచ అందాల పోటీల నిర్వాహక సంస్థ ప్రకారం..1994లో న్యూయార్క్ నగరంలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్వైడ్ పోటీలో, ఫెమినా మిస్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన కర్మిందర్ కౌర్ విర్క్ విజేతగా నిలిచారు. ఆమె మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, ఉత్తమ జాతీయ దుస్తుల పురస్కారాన్ని కూడా గెలుచుకున్నారు. ఆమె 1994లో ఐశ్వర్య రాయ్కు మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా అందించారు.
ఆ కాలంలో అగ్రశ్రేణి మోడల్ అయిన కర్మిందర్, సోనీ టీవీలో ప్రసారమైన 'చార్లీస్ ఏంజిల్స్' ఆధారంగా రూపొందించిన 'సి.ఎ.టి.ఎస్.' అనే టీవీ సీరియల్లో కూడా నటించారు. ఆమె సునీల్ శెట్టి నటించిన 'పృథ్వీ', 'శాస్త్ర' వంటి కొన్ని బాలీవుడ్ మూవీలలో కూడా నటించారు. వివాహం తర్వాత కర్మిందర్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు.
(చదవండి: వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా? ఎందుకంటే..)


