ఛత్రపతి విజయ విహారం..! ఆరో రోజుల టూర్‌.. | IRCTC's Bharat Gaurav Tourist Train Chhatrapati Shivaji Maharaj Circuit | Sakshi
Sakshi News home page

ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్క్యూట్..! ఆరో రోజుల ఐఆర్‌సీటీసీ భారత్‌ గౌరవ్‌ యాత్ర..

Jun 2 2025 9:15 AM | Updated on Jun 2 2025 9:59 AM

IRCTC's Bharat Gaurav Tourist Train Chhatrapati Shivaji Maharaj Circuit

ఈ టూర్‌లో గిరిదుర్గాలే ప్రధానం. ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతీకలు. తిరుమల కొండలంత ఎత్తులో ఉన్నాయి. ఇక... ఓ వనాలయం... మరో నగరాలయం. అవి... దట్టమైన వనాల్లో విస్తరించిన జ్యోతిర్లింగం.మరోటి... ప్రాచీన నగరంలో విలసిల్లిన లక్ష్మీదేవి ఆలయం.

1వ రోజు
ఉదయం ఆరున్నరకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, థానేలలో ఎక్కడైనా రైలెక్కవచ్చు. రైలు రాయగఢ్‌ వైపు సాగుతుంది. రైల్లో బ్రేక్‌ఫాస్ట్‌ ఇస్తారు. పదిన్నరకు రైలు మాన్‌గోవ్‌ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన రాయగఢ్‌ కోటకు చేరాలి. 

మధ్యాహ్న భోజనం ఎక్కడ అనేది సమయాన్ని బట్టి నిర్ధారిస్తారు. రాయగఢ్‌ పర్యటన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు మాన్‌గోవ్‌ స్టేషన్‌కు వచ్చి రైలెక్కాలి. రైలు ఆరు గంటలకు పూనే వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే. పది గంటలకు రైలు పూనేకు చేరుతుంది. హోటల్‌కు చేరడం, పూనేలో రాత్రి బస.

పట్టాభిషేక దుర్గం
రాయిగఢ్‌ కోట ఉన్న పట్టణం పేరు మహద్‌. మహారాష్ట్ర, రాయగఢ్‌ జిల్లాలో ఉంది. ఇది మహాదుర్గం. సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని ఈ కొండమీదకు చేరడానికి రోప్‌వే, ఏరియల్‌ ట్రామ్‌వే ఉన్నాయి. కోట లోపల శివాజీ సింహాసనం, పట్టాభిషేకం జరిగిన ప్రదేశం, చెక్కతో నిర్మించిన రాణి ప్యాలెస్, శివాజీ తల్లి జిజాబాయి సమాధి, శివాజీ సమాధి ఉన్నాయి. 

కోటగోడలు, దర్వాజాల మీదకు అల్లుకున్న పిచ్చి చెట్లుతీగలనుచూస్తే ఈ కోట పరిరక్షణ పట్ల ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని తెలుస్తుంది. ఇప్పుడు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకి బాధ్యత అప్పగించడంతో పునరుద్ధరణ చర్యలు జరుగుతున్నాయి. ఈ కోట మీద నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి సౌందర్యం అంతా దండగా అల్లి అమర్చినట్లుంటుంది. ఇది ఒక ఫీల్‌గుడ్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌.

2వ రోజు
హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత పూనాలోని లాల్‌ మహల్, కాస్బా గణపతి ఆలయాల సందర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత శివ్‌శ్రుతి వీక్షణం. రాత్రి భోజనం తర్వాత హోటల్‌ గదికి చేరడం. ఆ రాత్రి బస కూడా పూనేలోనే.లాల్‌ మహల్‌ అంటే శివాజీ బాల్యం గడిచిన ΄్యాలెస్‌. శివాజీ తండ్రి షాహాజీ భోసాలే తన కొడుకు, భార్య కోసం కట్టించిన ప్యాలెస్‌ ఇది. నిజానికి షాహాజీ కట్టించిన నిర్మాణం నిర్వహణ సరిలేక శిథిలమైంది. 

ఇప్పుడు కనిపిస్తున్న ప్యాలెస్‌ అదే నమూనాలో చేసిన పునర్నిర్మాణం. ఇక నగరంలో చూడాల్సిన మరో ప్రదేశం కాస్బా గణపతి. ఇది శివాజీ తల్లి రాజమాత జిజాబాయి ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం. పూనే వాసులు గ్రామదేవతగా కొలుస్తారు. ఈఈ గణపతికి ఉన్న చారిత్రక ప్రత్యేకత ఏమిటంటే జాతీయోద్యమంలో భాగంగా బాలగంగాధర తిలక్‌ సామూహిక గణపతి ఉత్సవాలు మొదలు పెట్టింది ఈ ఆలయంలోనే. ప్రజలను ఒక చోటకు చేర్చడానికి, వారిని జాతీయోద్యమ బాట పట్టించడానికి ఈ ధార్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు తిలక్‌. 

3వ రోజు
శివనేరి కోట సందర్శనకు ఉదయాన్నే ఆరు గంటలకు టీ తాగిన తర్వాత హోటల్‌ నుంచి బయలుదేరాలి. బ్రేక్‌ఫాస్ట్‌ ΄్యాక్‌ చేసి ఇస్తారు. పూనే నుంచి శివనేరి కోటకు రెండు గంటల ప్రయాణం. మధ్యాహ్న భోజనం తర్వాత భీమశంకర్‌ దర్శనానికి వెళ్లాలి. ఈ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత పూనేకి వచ్చి రాత్రికి హోటల్‌లో బస చేయాలి.

మరాఠా రాజ్యం పుట్టింది!
శివ్‌నేరి కోట ఛత్రపతి శివాజీ పుట్టిన ప్రదేశం. మరాఠా రాజ్య నిర్మాత పుట్టిన నేల అంటే మరాఠా రాజ్యం పుట్టిన నేల కూడా. శివాజీ తాత మాలోజీ భోసాలే నివసించిన కోట ఇది. బహమనీ సుల్తానులు, మొఘలులు, బ్రిటిష్‌ వారితో జరిగిన యుద్ధాలకు కేంద్ర బిందువు కూడా. ఈ కోట లోపల గంగ, యమున పేరుతో రెండు నీటి గుండాలున్నాయి. ఏడాది పొడవునా వీటిలో నీరు ఉంటుంది. 

ఈ కోట పై అంతస్థు నుంచి చూస్తే నారాయణగఢ్, హద్సార్, చావాంద్, నీమ్‌గిరి కోటలు కనిపిస్తాయి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉండడంతో యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ ఈ కోటను వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. శివ్‌నేరి కోట నుంచి 70 కిమీల దూరంలో ఉంది భీమశంకర్‌. చిక్కటి పచ్చదనంతో విస్తరించిన సహ్యాద్రి శ్రేణుల్లో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవ జ్యోతిర్లింగ క్షేత్రం. మహారాష్ట్రలో భీమనది తీరాన ఉంది. 

4వ రోజు
ఉదయం పూనేలో హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి రైలెక్కాలి. ఏడు గంటలకు రైలు బయలు దేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ రైల్లో ఇస్తారు. రైలు పది గంటలకు సతారా స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన ప్రతాప్‌గఢ్‌ కోటకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం, కోట సందర్శనం, రాత్రి భోజనం తర్వాత పదిన్నరకు రైలెక్కాలి. పదకొండున్నరకు రైలు కొల్హాపూర్‌ వైపు బయలుదేరుతుంది.

మరాఠ విజయం
మరాఠా సామ్రాజ్య స్థాపనలో కీలకమైన కోట ప్రజాప్‌గఢ్‌. మరాఠా సామ్రాజ్యాధినేత శివాజీకి బహమనీ సుల్తాన్‌ అజమ్‌ఖాన్‌కు మధ్య జరిగిన భీకర యుద్ధంలో శివాజీ గెలిచాడు. శివాజీ కొలిచిన తుల్జా భవానీ మాత ఆలయం ఈ కోటలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట అందమైన ప్రకృతి సౌందర్యవీక్షణానికి వేదిక కూడా. 

5వ రోజు
తెల్లవారు జామున ఐదు గంలకు రైలు కొల్హాపూర్‌లోని షాహూ మహారాజ్‌ టెర్మినస్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్‌కు వెళ్లి రిఫ్రెష్‌ అయిన తర్వాత కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయ దర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత పన్హాల ఫోర్ట్‌ సందర్శనం. ఆ తర్వాత కొల్హాపూర్‌లోని రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి ముంబయి వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే.

కొల్హాపూర్‌ మహారాష్ట్ర కాశీ
భారతీయులు జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలని కోరుకునే ప్రదేశం కొల్హాపూర్‌. ఇక్కడి లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి ఉత్తర– దక్షిణ భారతాల వాళ్లు వస్తారు. ఈ ఆలయ నిర్మాణం గురించి కూడా విశేషంగా చెప్పుకోవాలి. దక్షిణాది ఆలయాల్లాగ విగ్రహాల సుమహారంగా ఉండదు. ఉత్తరాది నిర్మాణాల్లాగానూ ఉండదు. స్థూలంగా నిర్మాణం రెండింటి కలయికగా ఉంటుంది. 

సునిశితంగా శిల్పనైపుణ్యాన్ని గమనిస్తే జామెట్రికల్‌ డిజైన్స్‌తో ఆచ్చెరువు కలిగిస్తుంది. దక్షిణ కాశిగా చెప్పుకుంటారు. పెద్ద పట్టణం, మరాఠీ సినిమా పరిశ్రమ కేంద్రం. ఈ పర్యటనలో కొల్హాపూర్‌ లక్ష్మీదేవి దర్శనం తర్వాత న్యూ ప్యాలెస్‌ వీక్షణం. ఆ తర్వాత కొల్హాపురి చెప్పులు ఒక జత కొనుక్కోవడం మర్చి΄ోవద్దు. ఎందుకంటే పనితనం రీత్యా వీటికి జీఐ (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ కూడా వచ్చింది.

పన్హల ఫోర్ట్‌
శివాజీ ఈ కోటను బీజాపూర్‌ సుల్తానులతో యుద్ధం చేసి సాధించాడు. ఆ తర్వాత మరికొన్ని నిర్మాణాలు చేశాడు. శివాజీ వారసులు ఈ కోట నుంచి మొఘల్, బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీతో యుద్ధాలు చేశారు. ఈ కోట నిర్మాణపరంగా పెద్దది కాదు, కానీ మరాఠాల పాలన ముందుచూపుకు నిదర్శనం. కోట లోపల ధాన్యాగారం ఉంది. అందులో నిల్వ చేసిన ధాన్యం కోట లోపల ఉన్న వారికి మాత్రమే కాదు, రాజ్యంలో కరువు సంభవిస్తే ప్రజల ఆకలి తీర్చడానికి ఒక ఏడాదికి సరిపడినంత ధాన్యాన్ని నిల్వ చేసేవారు. 

కోట లోపల ఒక దిగుడు బావి ఉంది. స్టెప్‌వెల్‌లు గుజరాత్‌లో ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీలోనూ ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ ఉంది. తెలంగాణ జిల్లాల్లో కూడా ఉండేవి. ఆర్కియలాజికల్‌ సర్వే విభాగం తవ్వకాల్లో ఇటీవల కొన్ని స్టెప్‌వెల్‌లు బయటపడ్డాయి. భారతీయ శాస్త్రీయత నిర్మాణాలకు ఇవి తార్కాణాలు. 

6వ రోజు
ఉదయం ఆరు గంటలకు రైలు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు చేరడంతో టూర్‌ పూర్తవుతుంది. దాదర్, థానేల్లో కూడా దిగవచ్చు. 

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ సర్క్యూట్‌ ప్రతాప్‌గఢ్‌... 
ఇది ఐఆర్‌సీటీసీ భారత్‌ గౌరవ్‌ యాత్ర నిర్వహిస్తున్న ఆరు రోజుల టూర్‌ ప్యాకేజ్‌. జూన్‌ 9వ తేదీన మొదలవుతుంది. ముంబయిలో మొదలయ్యే ఈ టూర్‌లో రాయగఢ్‌ ఫోర్ట్, పూనే, శివనేరీ ఫోర్ట్, భీమశంకర్‌ జ్యోతిర్లింగ దర్శనం, ప్రతాప్‌గఢ్‌ ఫోర్ట్, కొల్హాపూర్, పన్హలా ఫోర్ట్‌ కవర్‌ అవుతాయి.

కొంకణ్‌ రైల్వేస్‌ ట్రైన్‌ ముంబయిలో ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ నుంచి టూర్‌ మొదలవుతుంది. మాన్‌గోవ్, పూనే, సతారా, ఛత్రపతి షాహూ మహారాజ్‌ టెర్మినస్‌ కొల్హాపూర్‌ మీదుగా తిరిగి ముంబయికి చేరుతుంది.

టికెట్‌ ధరలు స్లీపర్‌ క్లాస్‌ (ఎకానమీ)లో ఒకరికి 13,155 రూపాయలు, ధర్డ్‌ ఏసీ (కంఫర్ట్‌)లో దాదాపుగా 20వేలు, సెకండ్‌ ఏసీ (సుపీరియర్‌)లో 27 వేలకు పైగా అవుతుంది. 

రాత్రి బసకు ఎకానమీ క్లాస్‌కు నాన్‌ ఏసీ గదులు డబుల్‌ లేదా ట్రిపుల్‌ షేరింగ్‌లో ఇస్తారు. రైలు దిగిన తరవాత రోడ్డు ప్రయాణానికి నాన్‌ ఏసీ వాహనంలో ప్రయాణం. కంఫర్ట్, సుపీరియర్‌ ΄్యాకేజ్‌లో బస ఏసీ గదుల్లో. ఒక్కరుగా బుక్‌ చేసుకున్న వారు ఇతర ప్రయాణికులతో రూమ్‌ షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

లోకల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఏసీ వాహనాలు. ప్యాకేజ్‌లో చెప్పిన టికెట్‌ ధరలకు ట్యాక్స్‌ అదనం. ప్యాకేజ్‌లో ట్రావెల్‌ ఇన్సూ్యరెన్స్, సెక్యూరిటీ ఉంటుంది. భోజనం శాకాహారం ఇస్తారు.  

పర్యాటక ప్రదేశాల్లో బోటింగ్‌ వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు.

– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిధి 

(చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్‌కే అందని మిస్టరీ..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement