ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు! | India Hidden Natural Wonders Travel Places | Sakshi
Sakshi News home page

ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు!

Aug 24 2026 8:11 AM | Updated on Aug 24 2026 8:53 AM

India Hidden Natural Wonders Travel Places

ట్రావెల్‌

ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ద్వీపాలు కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు, లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉంటాయి.

ఈ ఐదు ప్రదేశాలు అలాంటి ప్రకృతి అద్భుతాలే. మేఘాలయలోని సజీవ వేర్ల వంతెనల నుంచి మహారాష్ట్రలోని కాస్‌ పీఠభూమి వరకు ప్రతి ప్రదేశంలో ప్రకృతి మనకు కొత్త రూపంలో కనిపిస్తుంది.

త్సో మోరీరి సరస్సు
లడఖ్‌ అంటే చాలా మందికి ప్యాంగాంగ్‌ గుర్తొస్తుంది. కానీ చాంగ్‌థాంగ్‌లో ఉన్న త్సో మోరీరి ఒక ప్రశాంతమైన అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 4,500 మీటర్ల ఎత్తులో, చుట్టూ కొండల మధ్య నీలం రంగులో విస్తరించిన ఈ సరస్సు ఒక పెద్ద ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది.

లేహ్‌ నుంచి త్సో మోరీరి వైపు ప్రయాణం చేస్తుంటే భూదృశ్యం పూర్తిగా మారిపోతుంది. రాళ్లు, గడ్డి మైదానాలు, దూరంగా కనిపించే హిమ శిఖరాల మధ్య చివరికి సరస్సు కనిపించిన క్షణం మర్చిపోలేని దృశ్యంగా మిగిలిపోతుంది. కోర్జోక్‌ గ్రామం, కోర్జోక్‌ మఠం, సరస్సు చుట్టూ తిరిగే వలస పక్షులు ఈ ప్రదేశంలో ప్రత్యేక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాంగ్పా సంచార జీవన విధానాన్ని కూడా చూసే అవకాశం లభిస్తుంది.

నీళ్లపై తేలే జీవితం
మణిపూర్‌లోని లోక్‌టక్‌ సరస్సును మొదటిసారి చూసినప్పుడు అది ఒక పెద్ద సినిమాటిక్‌ సీన్‌లా, ఒక కొత్త సముద్రంలా అనిపించవచ్చు. కానీ దగ్గరగా చూస్తే ఆ నీళ్లపై చిన్న చిన్న తేలియాడే ద్వీపాలు కనిపిస్తాయి. వీటిని ఫుమ్డీలు అంటారు. వాటిపై ఇళ్లు, జీవనం, చేపల వేట అన్నీ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపిస్తుంది.

ఇంఫాల్‌ నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్‌టక్, ఈశాన్య భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు. అదే సరస్సులో కీబుల్‌ లాంజోవా జాతీయ ఉద్యానవనం ఉండటం మరో అద్భుతం. ప్రకృతి, నీరు, జీవన విధానం కలిసి ఒక చిత్రంలా కనిపించే అందమైన ప్రదేశం ఇది.

మేఘాలు నివసించే లోయ

  • నాగాలాండ్, మణిపూర్‌ మధ్య ఉన్న జుకోవ్‌ లోయను చూస్తే భూమిపై ఒక పచ్చని సముద్రం పరుచుకున్నట్టు అనిపిస్తుంది. సుమారు 2,452 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోయలో సీజనల్‌ పూలు, వెదురు తోటలు, చిన్న చిన్న సెలయేర్లు అందంగా ఉంటాయి.

  • హైదరాబాద్‌ నుంచి ప్రయాణం మొదలు పడితే ముందుగా నాగాలాండ్‌ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈశాన్య భారతదేశపు భూదృశ్యం మెల్లిగా మారుతుంది. నాగాలాండ్‌ కొండలు దగ్గరవుతున్న కొద్దీ రోడ్డు ప్రయాణంలోనే ప్రకతి తన రంగులను మార్చుకుంటూ వస్తుంది.

  • జుకోవ్‌లో ఒక రోజు గడపడం అంటే కేవలం ట్రెక్కింగ్‌ అనుభవం మాత్రమే కాదు. మేఘాల లోయలో నిలిచిపోయిన సమయం, గాలిలో వెదురు ఆకుల శబ్దం, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక అందమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎండాకాలంలో కనిపించే ప్రత్యేక జుకోవ్‌ లిల్లీ ఈ ప్రదేశానికి మరో గుర్తింపు ఇస్తుంది.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి ఈ ఐదు గమ్యస్థానాలకు వెళ్లే మార్గం అనేది గమ్యస్థానాన్ని బట్టి మారుతుంది. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్‌ ప్రాంతాలకు మీరు గువాహటి, ఇంఫాల్, దిమాపూర్‌ నుంచి చేరుకోవచ్చు. లడఖ్‌ వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి లేహ్‌ చేరుకుని, అక్కడి నుంచి చాంగ్‌థాంగ్‌ వైపు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లవచ్చు. ఈ ప్రయాణం చాలా మందికి నచ్చుతుంది. కాస్‌ పీఠభూమికి పుణే లేదా సతారా మార్గంలో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది.

ఆసక్తికరమైన విషయాలు

లివింగ్‌ రూట్‌ బ్రిడ్జ్‌లు అనేవి మేఘాలయలోని ఖాసీ, జైంటియా సామాజిక వర్గాల ప్రజలు ప్రకృతితో కలిసి పెంచిన సజీవ నిర్మాణాలు.

లోక్‌టక్‌ సరస్సు అనేది ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇందులో కనిపించే ఫుమ్డీలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

జుకో లోయ అనేది నాగాలాండ్, మణిపూర్‌ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లోయ. సీజనల్‌ పూలతో పాటు జుకోవ్‌ లిల్లీకి ప్రసిద్ధి.

త్సో మోరీరి చాంగ్‌థాంగ్‌ ప్రాంతంలో సుమారు 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన, ఎత్తైన ప్రాంతంలోని సరస్సు.

కాస్‌ పీఠభూమి అనేది పశ్చిమ కనుమల్లోని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ పీఠభూమి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.

దక్షిణాది పూల లోయ

  • మహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న కాస్‌ పీఠభూమిని మహారాష్ట్రలోని పూల లోయ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం తరువాత ఈ పీఠభూమిపై వందల రకాల పూలు ఒకేసారి విరిసి, భూమి మొత్తం రంగుల తివాచీలా మారుతుంది. 1200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్‌లో 850 కిపైగా పూల జాతి మొక్కలు ఉంటాయి.

  • హైదరాబాద్‌ నుంచి పూణే వైపు ప్రయాణం చేసి, అక్కడి నుంచి సతారా మార్గంలో సాగాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమల మధ్య సాగే ఈ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది. ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ మధ్య పూల సీజన్‌ లో ఈ పీఠభూమి పూర్తిగా మారిపోతుంది. దగ్గరలోని కాస్‌ సరస్సు, బమ్నోలి, ఠోసేఘర్‌ జలపాతాలు, సజ్జన్‌ గడ్‌ లాంటి ప్రదేశాలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణలుగా మిగిలిపోతాయి.

ఏం తినాలి?
మేఘాలయలో స్థానిక ఖాసీ వంటకాలు, మణిపూర్‌లో అన్నంతో తయారు చేసే సంప్రదాయ వంటకాలు, నాగాలాండ్‌లో స్థానిక మాంసాహార వంటకాలు, లడఖ్‌లో తుక్‌పా, మోమోలు, మహారాష్ట్రలో కంది పెఢా, పిట్లా, ఇతర స్థానిక మహారాష్ట్ర వంటకాలు మీ ప్రయాణానికి రుచికరమైన అనుభూతిని ఇస్తాయి.

వేర్లతోనే వంతెనలు 
మేఘాలలో ఖాసీ ప్రజల జీవన విధానం ప్రకతితో మమేకమైన జీవన విధానం. దీనికి సాక్షాలే సజీవ వేర్ల వంతెనలు. ఫికస్‌ ఎలాస్టికా చెట్ల వేర్లను సంవత్సరాల పాటు పెంచి, నది రెండు వైపుల కలిసేలా తయారు చేసిన ఈ వంతెనలు కాంక్రీట్‌ నిర్మాణంలా బలంగా ఉంటాయి. కొన్ని వంతెనలు వందేళ్ల పాటు నిలిచి ఉన్నాయని మేఘాలయ పర్యాటక శాఖ చెబుతుంది.

నాంగ్రియాట్, సోహ్రా, మాలినాంగ్‌ ప్రాంతాల్లో ఇలాంటి వంతెనలను చూడవచ్చు. పచ్చని అడవుల్లో నడుస్తుంటే కింద ప్రవహిస్తున్న నీటి మధ్య వేర్లు కలిసి వంతెనలా మారడం చూస్తే, మనిషి, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది.

ఎక్కడ ఉండాలి?
లివింగ్‌ రూట్‌ బ్రిడ్జ్‌ల సమీపంలో గ్రామీణ హోమ్‌స్టేలు, లోక్‌టక్‌ సరస్సు వద్ద సరస్సు ఒడ్డున ఉండే వసతి సౌకర్యాలు, జుకో లోయ ప్రయాణంలో పర్వత రహదారులు కనిపించే వసతి ప్రదేశాలు బాగుంటాయి.
త్సో మోరీరి సమీపంలోని కొర్జోక్‌లో అతిథి గృహాలు, క్యాంపులు అందుబాటులో ఉంటాయి. కాస్, సతారా ప్రాంతంలో హోటళ్లు, హోమ్‌స్టేలు ఉంటాయి. ప్రతీ గమ్యస్థానంలో బస చేయడం కూడా ఒక జ్ఞాపకంగా మారిపోతుంది.

ఏం చూడాలి?
లివింగ్‌ రూట్‌ బ్రిడ్జ్‌ల మధ్య ప్రవహించే నీరు, లోక్‌టక్‌ సరస్సులో తేలియాడే ఫుమ్డీలు, జుకో లోయలో కనిపించే సీజనల్‌ పూలు, త్సో మోరీరి నీలిరంగు సరస్సు, కాస్‌లో విరబూసే సీజనల్‌ పువ్వులుం ఈ ఐదు గమ్యస్థానాల్లో మీరు ఎక్కడా ప్రయాణ అనుభూతిని మిస్‌ అవరు. ఈ గమ్యస్థానాలను వేగంగా చుట్టేయాలని కాకుండా ప్రశాంతంగా ఆస్వాదించడానికి ్రపాధాన్యత ఇవ్వండి.

సందర్శనీయ ప్రదేశాలు
ఈ ఐదు ప్రదేశాలలో ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని ఇస్తుంది. మేఘాలయలో మనిషి చేతులతో పెంచిన వేర్ల వంతెనలు ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని కొనసాగించే సందేశాన్ని అందిస్తాయి. అలాగే లోక్‌టక్‌లో నీటిపై జీవితం, జుకోలో పూల మధ్య మేఘాలు, త్సో మోరీరిలో ఆకాశం సరస్సులో ప్రతిబింబించడం, వర్షాల తరువాత భూమి పూలనే అక్షరాలుగా మార్చుకుని మాట్లాడటం ఇవన్నీ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలే కదా.

యాక్టివిటీస్‌
ఈ ప్రయాణంలో రూట్‌ బ్రిడ్జ్‌పై నడవడం, లోక్‌టక్‌ సరస్సులో తేలియాడే ప్రకతి దశ్యాలను చూడటం, జుకో లోయలో మేఘాల మధ్య నడవడం, త్సో మోరీరి సరస్సు తీరంలో పర్వతాల ప్రతిబింబాలను ఆస్వాదించడం, కాస్‌లో సీజనల్‌ పూల మధ్య ప్రకృతిని గమనించడం ఇవన్నీ ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతాయి.

యాత్ర, బడ్జెట్‌ వివరాలు

  • ఐదు రోజుల ట్రిప్‌లో బడ్జెట్‌ అనేది గమ్యస్థానాన్ని బట్టి మారిపోతుంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో ప్రయాణించడం, స్థానిక రవాణా, బస, ఆహారం అన్నీ కలిపి బడ్జెట్‌ ప్రయాణానికి సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు అవ్వొచ్చు.

  • సాధారణ స్థాయి ప్రయాణ బడ్జెట్‌తో వెళ్తే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవానికి అయితే రూ.70,000కు పైగా ఖర్చు కావచ్చు. త్సో మోరీరి, జుకో లోయ, లివింగ్‌ రూట్‌ బ్రిడ్జ్‌ల వంటి ప్రాంతాల్లో స్థానిక రవాణా, బస ఆధారంగా బడ్జెట్‌ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

  • బస విషయానికి వస్తే ఒక్క రాత్రికి రూ.1,000–4,000 మధ్యలో బడ్జెట్‌ పెట్టుకోవడం మంచిది. ప్రీమియం హోటళ్లకు మరింత ఖర్చు కావచ్చు. ఆహారం కోసం రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ రుచికి, ఎంపికకు అనుగుణంగా ఈ ఖర్చులు మారుతాయి.
    - ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

ఇవి కూడా చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్‌ రివర్‌’ అని ఎందుకు అంటారో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement