సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌.. కొత్త పుంతలు | hyderabad turns as a city of terrace gardens full details sagubadi | Sakshi
Sakshi News home page

Hyderabad: సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌కు నగరం చిరునామా

Jun 26 2025 7:37 PM | Updated on Jun 26 2025 8:12 PM

hyderabad turns as a city of terrace gardens full details sagubadi

70 వేల మందికి పైగా ఔత్సాహికులు 

డాబాలు, బాల్కనీలపై మిద్దె తోటలు

హైద‌రాబాద్ కేంద్రంగా దేశ, విదేశాలకు విస్తరణ

యాపిల్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ తదితర ఫలాల సాగు

పది పాదులతో ఇంటికి సరిపడా కూరగాయలు

ఒకప్పటి ఉద్యానాల భాగ్యనగరం.. ఇప్పుడు  ‘సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌’గా ప్రసిద్ధి చెందుతోంది. ఇంటిపంట కొత్త పుంతలు తొక్కుతోంది. నగరం కేంద్రంగా ఇంటి పంటల సంస్కృతి దేశ, విదేశాలకు విస్తరించింది. హైద‌రాబాద్ గ్రేటర్‌ పరిధిలోనే సుమారు 70 వేల మందికి పైగా టెర్రస్‌ గార్డెనర్స్‌ భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. డాబాలు, బాల్కనీలు తదితర ప్రాంతాల్లో సుమారు 15వేల చదరపు గజాలకు పైగా విస్తీర్ణంలో ఇంటి పంటలను పండిస్తున్నట్లు అంచనా. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు  ఇళ్లపై సాగు చేస్తున్నారు. నగర టెర్రస్‌లపై ఆరోగ్య సిరులు కురిపిస్తున్న ఇంటి పంటలు సామాజిక మాధ్యమ వేదికలుగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి.

బ్రిటన్, అమెరికా, సింగపూర్, జర్మనీ, ఆ్రస్టేలియా తదితర దేశాల్లోని తెలుగువాళ్లు అన్ని రకాల కూరగాయలను తమ ఇళ్లపై పండించుకొని ఇంటిపంట రుచిని ఆస్వాదిస్తున్నారు. 2019లో కేవలం 30 మంది సభ్యులతో ఏర్పడిన ‘సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్‌’ సమూహం ఇప్పుడు 70,000 సంఖ్య దాటింది. వందల కొద్దీ వాట్సాప్‌ గ్రూపులు ఇంటిపంటల  ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. కొత్త తరహా పంటలను  పరిచయం చేస్తున్నాయి. ఇంటిపంట సంస్కృతి దైనందిన జీవితంలో ఒక భాగమైంది. స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలతో ఆరోగ్యకర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 

స్ట్రాబెర్రీ గ్రూపుతో ఆరంభం.. 
‘మనం ఏం తింటామో అది మనమే పండించుకుందాం’ అనే నినాదంతో 6 సంవత్సరాల క్రితం నగరంలో 30 మంది సభ్యులతో  ‘స్ట్రాబెర్రీ’ గ్రూప్‌  ప్రారంభమైంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట మాత్రమే పండే స్ట్రాబెర్రీలను  టెర్రస్‌లపై పెంచే  లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్‌ హార్కర కన్వీకర్‌గా, ఈదల సరోజ కో– కన్వీనర్‌గా ఈ గ్రూపు సేవలు  మొదలయ్యాయి. కేవలం 500 స్ట్రాబెర్రీ మొక్కలను తెప్పించి అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అనూహ్యంగా 5,600 మొక్కల కోసం ఆర్డర్లు వచ్చాయి. స్ట్రాబెర్రీ గ్రూపు వేగంగా విస్తరించింది. ఈ  సమూహమే సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌ (సీటీజీ)గా అవతరించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, అండమాన్‌ తదితర నగరాలతో పాటు విదేశాలకు విస్తరించింది. ఇంటి పంటలపై అనుభవాలను పంచుకొనేందుకు అవగాహనను పెంచుకొనేందుకు వేలాది మంది ఆసక్తి కనబర్చారు. సాధారణ కూరగాయలు, ఆకుకూరలతో  పాటు కూరగాయల్లోనే  ఎంతో విలువైన ఆగాకర, కాసర దుంపలు, పెన్సిల్‌ దొండ పాదులు  వంటి వెరైటీ మొక్కలను సీటీజీ హైదరాబాద్‌ గార్డెనర్స్‌కు పరిచయం చేసింది. వంగ, మిర్చి, టమాటా, కాప్సికం, బీర, సొర, కాకరలలో అధిక దిగుబడినిచ్చే రకాలను నగరంలో అభివృద్ధి చేశారు.

ఎన్నెన్నో వెరైటీలు..  
సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌ (city of terrace gardens) ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కింది. గ్రీన్‌ చామంతి, తెల్ల బంతి వంటి వెరైటీలు నగరంలో విరబూస్తున్నాయి. ఇక్కడి వాతావరణానికి అనుకూలమైన రెండు రకాల యాపిల్‌ మొక్కలను పెంచారు. మేఘాలయ ప్రభుత్వం ధ్రువీకరించిన లక్డంగ్‌ పసుపు హైదరాబాద్‌లో మిద్దెతోటలపై పండుతోంది. మొక్కలకు అవసరమైన జీవన ఎరువులు, ఘన, ద్రవ రూప ఎరువులు సిటీ ఆఫ్‌ గార్డెనర్స్‌ అందజేస్తోంది. నగర వాసులు తమ కూరగాయలు తామే పండించుకొని అందరూ కలిసి ఆరోగ్యాన్ని పంచుకొనేలా సీటీజీ అనేక కార్యక్రమాలను చేపట్టింది. మొక్కల పెంపకం పట్ల విద్యార్థుల్లో  అవగాహన పెంచేందుకు గార్డెన్‌ విజిట్స్, ఫార్మ్‌ విజిట్‌ ట్రిప్స్, ఫీల్డ్‌ ట్రిప్స్, సీడ్‌ బాల్స్‌ వంటి వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

పది పాదులు ఉంటే చాలు.. 
‘కేవలం పది పాదులకు సరిపడా కుండీలను ఏర్పాటు చేసుకోగలిగితే ఏడాది పాటు ఇంటి అవసరాలకు కావాల్సినన్ని పండించుకోవచ్చు. ఆయా కాలాలకు అనుగుణమైన కూరగాయలను, ఆకుకూరలను 365 రోజులు పండించుకొనేలా ప్రత్యేమైన అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు సీటీజీ కో– కన్వీర్‌ సరోజ. కొత్తగా ఇంటిపంట ప్రారంభించేవారికి  శిక్షణనిస్తున్నారు. అవసరమైన కుండీలు, టబ్బులు, మొక్కలు, ఎరువుల వినియోగం, మొక్కలకు వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఈ శిక్షణ  దోహదంచేస్తోందని ఆమె చెప్పారు. కేబీఆర్‌ పార్కు, పబ్లిక్‌ గార్డెన్స్, అగ్రి–హార్టీకల్చరల్‌ సొసైటీ, తెలంగాణ ఉద్యానశాఖ, జీహెచ్‌ఎంసీ తదితర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఇంటి పంట ఉద్యమంలో భాగస్వాములుగా నిలిచాయి. సీటీజీ సమావేశాల్లో రిటర్న్‌ గిఫ్ట్‌ల రూపంలో వివిధ రకాల మొక్కలు, సేంద్రియ విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నారు.

చ‌ద‌వండి: త‌క్కువ పిండి ప‌దార్థం, ఎక్కువ కొవ్వున్న గింజ‌లు

ఇంటింటా ఓ మిద్దెతోట.. 
నగరంలో మిద్దెతోట (Midde Thota) చాలాకాలంగా విస్తరిస్తోంది. కేవలం కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలే కాకుండా కొంతమంది ప్రత్యేక అభిరుచితో చిన్న చిన్న ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటిపై చేపల పెంపకాన్ని ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. ధాన్యం పండిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఇంటిపంటల పట్ల అభిరుచి ఉన్నవాళ్లందరిని ఒక గొడుగు కిందకు తెచ్చి ఇంటిపంట సంస్కృతికి సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌ నూతన ఒరవడిని తెచ్చింది.

చాలా వెరైటీలు పెంచుతున్నారు 
హైదరాబాద్‌లో అన్నా వెరైటీ, హెచ్‌ఆర్‌ఎం యాపిల్‌ మొక్కలు పెంచారు. స్ట్రాబెర్రీతో పాటు బ్లాక్‌ బెర్రీ, ఇంగువ, కర్పూరం, ఇలాచీ దాల్చిన చెక్క ఆల్‌ స్పైసెస్‌ ప్లాంట్‌ వంటివి మన టెర్రస్‌లపై గుబాళిస్తున్నాయి. 2021 వరకు కూడా 5000 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత నాలుగేళ్లలోనే 70 వేల మందికి పైగా చేరారు. 
– ఈదల సరోజ, కో– కన్వీనర్, సీటీజీ    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement