
యాదగిరిగుట్టలో టాంగాల వద్ద కార్మికులు
టాంగాల ఉనికికి ఆధునికీకరణ దెబ్బ
రోడ్ల అభివృద్ధి.. పెరిగిన వాహనాలతో టాంగాల ఉనికికి దెబ్బ
ఆదరణ లేక పూట గడవడమే కష్టం
పాతగుట్ట దారిలోనే టాంగాలు
దయనీయంగా యాదగిరిగుట్ట టాంగా కార్మికులు
సాక్షి, యాదాద్రి: అభివృద్ధి అందరి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తే.. యాదగిరిగుట్ట టాంగా కార్మికుల జీవితాల్లో మాత్రం చీకటి మిగుల్చుతోంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యం లేని రోజుల నుంచి.. ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్న టాంగాలు.. ఆధునిక వాహన ప్రపంచంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వృత్తినే నమ్ముకున్న కార్మికులు ప్రస్తుతం పూట గడవని స్థితిలో ఉన్నారు. ఆహ్లాదం కోసం టాంగాలో ఎక్కి ఒక్కసారైనా ప్రయాణించాలని ఆశపడే కొందరు భక్తుల వల్లే.. కొద్దోగొప్ప ఉపాధిని పొందుతున్నారు.
పెరిగిన భక్తులు .. తగ్గిన ఆదాయం
ఆలయ పునర్మిర్మాణం తర్వాత యాదగిరిగుట్టకు రోజు రోజుకూ భక్తులు పెరుగుతున్నారు. రద్దీతో తమ రోజు వారి గిరాకీ పెరిగి.. ఆదాయం ఎక్కువ వస్తుందని భావించిన టాంగా కార్మికుల ఆశలు నీరుగారిపోయాయి. ఆటోలు, బస్సులు, సొంత వాహనాలు పెరిగాయి. ఫలితంగా తరతరాలుగా టాంగాల్నే నమ్ముకున్న వీరు మరో పనిచేయలేక.. కుటుంబాన్ని పోషించుకోవడానికి జవసత్వాలను తెచ్చుకుని బతుకు బండి లాగిస్తున్నారు. ఇంత స్పీడ్ యుగంలో కూడా గుర్రపు బండ్లను నమ్ముకుని యాదగిరిగుట్టలో టాంగాలపైనే ఆధారపడిన కుటుంబాల బతుకు చిత్రం దయనీయంగా ఉంది. తెలంగాణ (Telangana) తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సుమారు 70 ఏళ్లుగా టాంగాలే ప్రధాన రవాణా సౌకర్యం.
యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో లేని రోజుల్లో హైదరాబాద్, వరంగల్ (Warangal) మధ్యన గల రాయగిరి రైల్వే స్టేషన్లో దిగే వందలాది మంది భక్తులు.. స్వామి వారిని చేరుకోవాలంటే టాంగాలే దిక్కు. యాదగిరిగుట్ట బస్ డిపో ఏర్పాటు తర్వాత కూడా ప్రయాణికులు టాంగాల్లోనే ప్రయాణించేవారు. రాయగిరి, యాదగిరిపల్లి, గుండ్లపల్లి, యాదగిరిగుట్ట, సైదాపురం, మల్లాపురం.. ఇలా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన టాంగా కార్మికులు సుమారు 100 మంది టాంగాలను నడుపుతూ జీవించేవారు. రాయగిరి రైల్వే స్టేషన్, వడాయిగూడెం, యాదగిరిగుట్ట ఇలా మూడు స్టేజీల్లో భక్తులు, స్థానిక ప్రజలు టాంగాలపై ప్రయాణించేవారు. ఈ కుటుంబాలకున్న ప్రధాన ఆదాయ వనరు టాంగాలే కావడంతో.. రెండో తరం కూడా వాటిపై ఆధారపడి చాలీచాలని కూలితో జీవితాలను వెళ్లదీస్తున్నారు.
తగ్గిన గిరాకీ
యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ఏర్పాటు కావడంతో ఎర్రబస్సులు వచ్చాయి. రోడ్లు వెడల్పు కావడంతో బస్సులకు తోడుగా ఆటోలు, ప్రయాణికులకు ద్విచక్ర, నాలుగు చక్రాల సొంత వాహనాలు వచ్చాయి. దీంతో టాంగాలకు గిరాకీ తగ్గింది. టాంగాల వృత్తిని వీడలేక.. ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించక.. చాలీచాలని కూలితో విధిలేని పరిస్థితిలో బతుకు బండి నడుపుతున్నారు.
ఒక్క రూటే దిక్కయింది
టాంగాల ద్వారా యాదగిరిగుట్ట నుంచి పాత గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారి ఆలయం వరకు.. టాంగాల్లో తీసుకుపోయి తిరిగి యాదగిరిగుట్ట వరకు భక్తులను తీసుకుని వస్తున్నారు. ఒకప్పుడు గుట్ట నలుదిక్కులా గ్రామాలకు టాంగాలను నడిపిన కార్మికులు.. ప్రస్తుతం యాదగిరిగుట్ట నుంచి పాతగుట్ట వరకు మాత్రమే పరిమితమయ్యారు. రాయగిరి నుంచి బస్లు, ఆటోలు పెరగడంతో ఈ మార్గంలో టాంగాలు (Horse Cart) నడవడం లేదు. పాతగుట్ట రూట్లో నడిచే టాంగాలకు ఆటోల నుంచి పోటీ ఎదురు కావడంతో ఆందోళన నిర్వహించి.. ఆ ఒక్క రూట్లో ఆటోలు నడవకుండా కట్టడి చేసుకున్నారు.
చదవండి: నిజాం నవాబు మెచ్చిన బీబీపేట పాన్!
యాదగిరిగుట్ట, వడాయిగూడెం, రాయగిరి, గుండ్లపల్లి నుంచి ప్రస్తుతం 40 ఆటోలు నడుస్తున్నాయి. ఆదివారం, శనివారం, సెలవు రోజులు వస్తే అధికంగా వచ్చే భక్తుల వల్ల అన్ని టాంగాలకు పనిదొరికి రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదిస్తారు. మిగతా రోజుల్లో రూ.100 సంపాదించడమే చాలా కష్టం. కొందరైతే టాంగాలను రోడ్డుపైకి తీసుకురారు. యాదాద్రి రోడ్డు విస్తరణ పేరుతో గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న టాంగాల స్టాండ్ తొలగించారు. దీంతో రోడ్డు పక్కన టాంగాలు ఆపితే ట్రాఫిక్ పోలీసులు పంపిస్తున్నారు.
ప్రభుత్వం సహకరించాలి
టాంగా తోలుకుని స్వశక్తితో బతుకుబండి లాగిస్తున్న మాకు ప్రభుత్వం సహకారం అందించాలి. టాంగాలు, గుర్రాల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. రోడ్డు బాగాలేక గుర్రాలు అవస్థలు పడుతున్నాయి. టాంగాలు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా లేదు. రోడ్డుపక్కన పెడుతుంటే ప్రతి ఒక్కరూ బెదిరిస్తున్నారు. టాంగా స్టాండ్ ఏర్పాటు చేయాలి.
– అశోక్ గౌడ్, యాదగిరిగుట్ట
మా బతుకులు మారలేదు
పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం వరకు 40 ఏళ్లుగా 50 పైసల కిరాయికి తోలుతున్నా. రోడ్డు సౌకర్యం సరిగా లేని రోజుల నుంచి టాంగా నడుపుతున్నా. ప్రస్తుతం కూడా పాత గుట్ట రోడ్డు ఏమీ బాగాలేదు. రోడ్డు వేయాలి. టాంగా తోలడం ద్వారా వస్తున్న కొద్ది పాటి ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రభుత్వాలు ఎన్ని మారినా మా జీవితాలు మాత్రం మారడం లేదు.
– చిన్న బాబు, టాంగా కార్మికుడు, రాయగిరి రైల్వే స్టేషన్
చదువుకు పిల్లలు దూరం
మా తాత రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు ఎడ్ల బండిని నడిపేవాడు. మా నాన్న టాంగాలు తోలేవాడు. నేను 11 ఏళ్లుగా టాంగా తోలుతున్నా. వచ్చే డబ్బులతో పిల్లలను సరిగా చదివించలేకపోతున్నా. కుటుంబపోషణ భారంగా మారింది. టాంగా కార్మికులకు రుణాలు ఇవ్వాలి.
– శంకర్, రాయగిరి స్టేషన్