ఫ్రూట్స్‌తో.. బీకేర్‌ఫుల్‌..! | Health Tips: How To Identify And Purchase Healthy Fruits | Sakshi
Sakshi News home page

Summer Fruits: ఆరోగ్యకరమైన పండ్లను ఎంచుకోండి ఇలా..!

Apr 9 2025 10:20 AM | Updated on Apr 9 2025 1:14 PM

Health Tips: How To Identify And Purchase Healthy Fruits

వేసవి సీజన్‌ వచ్చిందో లేదో అప్పుడే మార్కెట్‌లో మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. మామిడి పండ్లేనా.. సీజనల్‌ స్పెషల్‌ వాటర్‌మెలన్, మరోవైపు ద్రాక్ష, ఆల్‌ సీజనల్‌ ఫేవరెట్‌ అరటి ఇలా అన్నిరకాల పండ్లు మార్కెట్‌లో సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆరోగ్యం కోసం ఇష్టంగా కొనుగోలు చేసే పండ్లు ప్రమాదకర రసాయనాలను ఇంట్లోకి.. మన ఒంట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే మామిడి పండ్లు.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితి నగరవాసులది. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రతి ఏడాది మరింత పెరుగుతూనే ఉండటం నగర జీవన శైలిని ఆందోళనకు గురిచేస్తోంది. సహజసిద్ధంగా విటమిన్లు, ప్రోటీన్లు తదితర పోషకాలను అందించే ఫలాలే ప్రజల అనారోగ్యానికి కారకాలుగా మారుతున్న నేపథ్యంలో అసలు మంచి పండ్లను ఎలా గుర్తించాలి అనే అంశంపై ఆరా తీస్తున్నారు నగరవాసులు.  

వేసవిలో పండ్లను ఎక్కువ ఆస్వాదించడానికి చాలా కారణాలున్నాయి. ఈ సీజన్‌లో మాత్రమే లభించే పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉండటం, వేసవి  తాపానికి డీహైడ్రేషన్‌ నుంచి సంరక్షించుకోవడానికి పళ్ల రసాలను తాగుతుంటారు. దీన్ని అదనుగా భావించి, మార్కెట్‌ డిమాండ్‌కు సరిపడా సరఫరా అందించడమే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ప్రమాదకర పంథాను ఎంచుకుంటున్నారు. సహజసిద్ధంగా పండ్లను మగ్గించడానికి బదులు కృత్రిమ పద్ధతిలో రసాయనాలను వినియోగిస్తున్నారు. 

ఇందులో భాగంగా కాల్షియం కార్బైడ్‌ వంటి విషపూరిత రసాయనాలను పండ్లు మగ్గించడానికి వాడుతున్నారు. ఈ పదార్థం అనారోగ్యాలకు కారణమని, దీంతో పండ్లను మగ్గించవద్దని గతంలోనే హైకోర్టు నిషేధించింది. అయినప్పటికీ మార్కెట్‌ అవసరాల కోసం కొందరు వ్యాపారులు ఈ రసాయనాలను వాడుతూనే ఉన్నారు. ఓ వైపు నగరంలో పరిశుభ్రత లేకుండా కత ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్లతోనే భయపడుతున్న సిటీజనులను ఈ పండ్ల పరిస్థితి మరింత భయపెడుతోంది. 

దీన్ని నివారించడానికే నగరాల్లో ఫుడ్‌ సేఫ్టీ విభాగం పలు నిబంధనలు అమలు చేస్తోంది. అనుమతి మేరకు ఇథిలిన్‌ ఛాంబర్స్‌ వినియోగించేలా సూచనలిచ్చింది. ఈ ఛాంబర్స్‌లో 72 గంటల్లో కాయలు పండ్లుగా మారే విధానంలో హార్మోన్లు సమపాళ్లలో ఉంటాయి. వీటితో పాటు ఇథోపాన్‌ అనే షాచెట్స్‌తో పండ్లను మగ్గించడానికి అనుమతి ఉంది.  ఈ మధ్య కాలంలో సహజసిద్ధంగా పండించిన పండ్లను ఎలా గుర్తు పట్టాలనే అంశాలపై నగరవాసులు ఆరా తీస్తున్నారు. 

కొందరైతే గూగుల్, యూట్యూబ్‌లో ఏఐని అడుగుతున్నారు. మరికొందరు సోషల్‌ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సహజపద్ధతిలో వండిన ఫలాలు కమ్మని, తియ్యటి వాసనతో ఉంటాయని నిపుణులు, ఆర్గానిక్‌ రైతులు పేర్కొంటున్నారు.  

ముఖ్యంగా ఈ పండ్లపై నల్లటి మచ్చలు కనిపిస్తాయని, అన్నిసార్లు అందంగా ఉన్న పండ్లే ఆరోగ్యకరమైనవని అనుకోవద్దని సూచిస్తున్నారు. ఫలాలను తెంపిన కాడ తాజాగా కాకుండా వాడిపోయనట్టు, సహజసిద్ధంగా పండించడం వల్ల ఈ పండ్లపై కాసింత గడ్డిపొట్టు, సన్నని బూజు కనిపిస్తాయి.

తీవ్ర అనారోగ్య సమస్యలు 
ముఖ్యంగా హైదరాబాద్‌ నగర కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాలతో సతమతమవుతున్న నగరవాసులకు కృత్రిమంగా పండ్లను మగ్గించడానికి వినియోగించే కాల్షియం కార్బైడ్‌ వంటి ప్రమాదక రసాయనాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. యువతకు కూడా ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రధానంగా హృదయం, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రిప్పెనింగ్‌ రసాయనాలు ఫలాలపై తొక్క మాత్రమే పండేలా చేస్తాయి. ఫలితంగా పండ్ల లోపలి గుజ్జు్జ పూర్తిగా పండకుండానే మార్కెట్లోకి అమ్మకానికి వస్తుంటాయి. 

వీటిని తినడం వల్ల వాంతులు, నీరసం, చర్మ సమస్యలు, విపరీతమైన దాహం, నోటిలో నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. చిన్నపిల్లలు, గర్భిణులకు ఈ పండ్లు మరింత ప్రమాదకరం. కాల్షియం కార్బైడ్‌ ఉత్పత్తి చేసే ఎసిటలీన్‌ మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీసి జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుందని పరిశోధనలు స్పష్టం చేశాయి. 

సహజంగా మగ్గించిన పండ్లను గుర్తుపట్టాలంటే.. ఒక బకెట్‌లో నీరు నింపి అందులో మార్కెట్‌లో కొన్న పండ్లను వేస్తే.. సహజంగా పండించిన ఫలాలు నీటి అడుగు భాగానికి చేరుకుంటాయి. ప్రమాదక రసాయనాలతో మగ్గించినవి మాత్రం నీటిపైకి తేలుతాయని నిపుణులు సూచిస్తున్నారు.  

కొందరు వ్యాపారులు వేడి చేసిన కాల్షియం కార్బైడ్‌ నీళ్లలో పండ్లను ఉడకబెట్టి కృత్రిమంగా మగ్గిస్తుంటారు. ఇలాంటి విధానాల్లో పండ్లు వాటి ఆకారాన్ని కోల్పోయి గుండ్రంగా మారుతాయి. అంతేకాకుండా రసాయనాలతో పండించినవి తాజాగా, చర్మం నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ఈ ఫలాలు వాటి సహజమైన రుచిని చాలా వరకు కోల్పోతాయి.  

ఈ ఫలాలపై ఆకుపచ్చ, బ్రౌన్‌ కలర్‌లో మచ్చలను గుర్తించవచ్చు. ఈ మధ్య కాలంలో పలువురు రైతులు సహజసిద్ధంగా పండ్లను పండించి, వాటిని పెద్ద పెద్ద వాహనాల్లో భారీ స్థాయిలో నగరానికి తరలించి అమ్ముతున్నారు.    

(చదవండి: Coconut Fiber Matress: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్‌ ఐదేళ్లలో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement