సాగుబడి
ఊడుగ పండు పేర్లు వేర్వేరు భాషల్లో: తెలుగు: నల్ల అంకోలము, నల్ల ఊడుగ ఇంగ్లీష్: సేజ్ లీవ్డ్ ఆలంజియం, హిల్ సాక్ ట్రీ, సోన్ మ్యాంగో ఉర్దూ: అంకోల్ ఒరియా: మొరట, బంగ అంకోల్ తమిళం: ఏలంజి, ఎరలిన్సిల్ పంజాబీ: ఆకోల్ బెంగాలీ: ఆకర కాంటా మరాఠీ: అంకోల్ మలయాళం: అంకోలం. కరంకొలం హిందీ: అంకోల, అంకోల్ సంస్కృతం: అంకోల, అంకోలక, అంకోత నేపాలీ: ఆంఫీ, అంకోల్ అని అంటారు.
పూత : ఫిబ్రవరి – ఏప్రిల్.
పండ్లు : మే – జూన్.
ఊడుగ చెట్టుకు ముళ్లు ఉంటాయి. పండ్లు ఒగరుతో కూడుకొని జిగటగా ఉంటాయి. గుత్తులుగా కాస్తుంటాయి. పండ్లు నశ్యం రంగులో ఉంటాయి. ఈ చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కల్గి ఉంది.
ఉపయోగాలు...
ఊడుగ చెట్లను రైతులు వీటిని జీవ కంచెగా పెంచుతారు.
పండ్లు తింటారు. వగరు, తీపి కలయిక రుచితో ఉంటాయి.
ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటి వేర్లు, పండ్లను కీళ్ళ నొప్పులు, పైల్స్ తగ్గించడానికి ఉపయోగిస్తారు.
వేర్ల బెరడును నులి పురుగులను విసర్జించడానికి వినియోగిస్తారు.
వెన్ను నొప్పిని అదుపులో ఉంచడానికి ఉపకరిస్తుంది.
పండ్లు, విత్తులు చలువనిస్తాయి. అట్లే శరీరానికి సత్తువనియ్యగలవు.
ఆకులు కూడా వాపును, ఎముకల పెళుసుదనాన్ని తగ్గించడానికి వాడుతారు.
జ్వరాలను తగ్గించడానికి వాడుతారు.
పచ్చి పుల్లలతో పండ్లు తోముకుంటే మంచిది. చిగుర్లు గట్టి పడుతాయి.
విత్తనాల నుండి తీసిన నూనెను చర్మంపై పూసినటైతే దురదలు తగ్గుతాయి. అలాగే గజ్జి కూడా తగ్గుతుంది. ఈ నూనెను బొడ్డు చుట్టు పూసుకుంటే మగత సమస్యకు చెక్ పెట్టవచ్చు.
కొమ్మల కషాయంతో విరేచనాలు, వాంతులను తగ్గించవచ్చు. ఆకులను ఉబ్బసాన్ని, కీళ్ల నొప్పులను తగ్గించడానికి వాడుతారు.
పండ్ల రసాన్ని కంటి సమస్యలకు ఉపయోగిస్తారు.
వేర్ల బెరుడును పసుపుతో కలిపి సుఖరోగాలను తగ్గించడానికి పై పూతగా వాడుతారు.
డెంగ్యూను తగ్గించడానికి వాడుతారు. మూడు గ్రాముల వేర్లు, రెండు గ్రాముల శొంఠిని దంచి పొడిని సేవించడం వల్ల డెంగ్యూ రోగం నుండి విముక్తి చెందవచ్చని చెబుతారు.
రేబీస్ రోగాన్ని నయం చేసే గుణం వీటి వేర్లకున్నది. వీటి వేర్ల కషాయం చేసి రోజుకు రెండుసార్లు, ఈ విధంగా ఒక నెల సాధన చేసే రేబీస్ రోగం నుండి విముక్తి పొందవచ్చునంటారు.
పాము కాటు నుండి ఉపశమనానికి వేర్ల బెరుడు పొడిని దాదాపు 350 ఎం.ఎల్.ను గ్లాసు ఆవు పాలలో బాగా కలిపి రోజుకు మూడుసార్లు సేవించడం వల్ల (వారం రోజులైనా చేయవలసి ఉంటుంది. పాము పాము కాటు నుండి విముక్తి పొందవచ్చని చెబుతారు. విషానికి విరుగుడుగా పనిచేస్తుంది).
మూత్ర విసర్జన మంటగా ఉంటే 5 గ్రాముల వేర్లను శుభ్రంగా కడిగి, 400 మిల్లి లీటర్ల నీళ్ళల్లో మరగనిచ్చి (ఆ నీళ్ళు ఒక భాగం అయ్యే వరకు) చల్లారిన తరువాత రోజుకు రెండుసార్లు తాగితే ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
ఏదైనా అతిగా తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే అజీర్తి, విరేచనాలు కూడా కావచ్చు. మోతాదుకు మించి వాడరాదు.
కట్టెలను వంట చెరుకుగా వాడుతారు. పెద్ద మండలను ఇటుక బట్టీలను కాల్చటానికి కూడి వాడుతారు.
జీవవైవిధ్య పరిరక్షణలో ఊడుగ చెట్టు పాత్ర ఎంతో ఉంటుంది.
ఉనికి...
ఊడుగ చెట్లు ఎక్కువగా వాగులు వంకలు, అడవులు, ఒడ్డుల వెంబడి పెరుగుతాయి. పొదలుగానే ఎక్కువగా ఎదుగుతాయి. కానీ అక్కడక్కడా ఎత్తు చెట్లుగా పెరుగుతాయి. ఇవి రమారమి 5–10 మీటర్ల వరకు స్థలాన్ని బట్టి పెరుగుతుంది. ఈ చెట్లు ఆకులను రాల్చుతాయి. ఇది ఉష్ణమండలానికి చెందిన చెట్టు. పవిత్ర వృక్షంగా గుర్తింపు వుంది. ఈ చెట్లు ఉన్న దగ్గర దేవాలయాలు వెలుస్తాయి. అలాగే గ్రామ దేవతల గుళ్ళ దగ్గర ఈ చెట్లు ఉంటాయి. వీటి స్వస్థలం భారత ఉపఖండం, కొమోరో ద్వీపాలు, ఆఫ్రికా తూర్పు ఉష్ణమండలం. భారత దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాలలో వీటిని గమనించవచ్చు. ఇతర దేశాలలో కూడా వీటి ఉనికి ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, కెన్యా, టాంజనియాలలో ఉంది.
- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


