వాతావరణ మార్పులను తట్టుకునే సమీకృత వ్యవసాయం! | Sagubadi: Climate Resilient Integrated Farming | Sakshi
Sakshi News home page

వాతావరణ మార్పులను తట్టుకునే సమీకృత వ్యవసాయం!

Jul 10 2026 8:55 AM | Updated on Jul 10 2026 8:55 AM

Sagubadi: Climate Resilient Integrated Farming

సాగుబడి

వ్యవసాయం అంటే పంటలు పండించటం. సమీకృత వ్యవసాయం అంటే ఒకే భూమిలో పంటల సాగుతో పాటు పశువులు/ కోళ్లు/ చేపల పెంపకం వంటివి కలిపి చెయ్యటం. దీనివల్ల ఖర్చులు తగ్గి, లాభాలతో పాటు భూసారం పెరుగుతాయి. వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే చిన్న, సన్నకారు రైతులకు సైతం ఆహార, ఆరోగ్య భద్రత కలుగుతాయి. ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వర్షాధార సమీకృత వ్యవసాయంపై విస్తృతమైన కృషి చేస్తోంది. ఒడిషాలో 
ఈ ఫౌండేషన్‌ అనుభవాలపై కథనం..

ఒడిషాలోని కోరాపుట్‌ జిల్లాలో వర్షాధారంగా వ్యవసాయం చేసే (మెట్ట) రైతులు సమీకృత వ్యవసాయాన్ని అనుసరించి బాగుపడుతున్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకొని.. ఆ నీటిని పంటలు, కూరగాయల సాగుకు ఉపయోగించుకోవడానికి వ్యవసాయ చెరువులు సహాయపడుతున్నాయి. వర్షాధారంగా వ్యవసాయం చేసే రైతులు వర్షాకాలంలో మాత్రమే ముఖ్యంగా వరి సాగు చేస్తుంటారు. అయితే, కోరాపుట్, నబరంగ్‌పూర్‌లోని ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో రైతులు ఒకడుగు ముందుకు వేశారు. ఈ రైతులకు చేపల సాగు, కూరగాయలు, పండ్ల చెట్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగు, పుట్టగొడుగుల పెంపకంతో పాటు వర్మీకంపోస్ట్‌ తయారు చేసుకొని బహుళ పంటలను సాగు చేయటంలో ఫౌండేషన్‌ రైతులకు శిక్షణ ఇచ్చింది.

ఈ నమూనా కాలానుగుణ ఇబ్బందులను తగ్గించిందని, ప్రతి ఇంట్లో ఆహార భద్రతను మెరుగుపరిచిందని, అలాగే వాతావరణంలో ఏర్పడే పెను మార్పులకు తట్టుకునే వ్యవసాయాన్ని మార్చుకునేలా చేసిందని రైతులు అంటున్నారు.

2017 నుంచి ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ అమలు చేస్తున్న సమీకృత వ్యవసాయ వ్యవస్థప్రాజెక్ట్‌ చక్కటి ఫలితాలనిస్తోంది.ప్రారంభంలో 20 మంది చేపలæ రైతులతో పైలట్‌ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఈ ఫలితాల నేపథ్యంలో, కోరాపుట్, నబరంగ్‌పూర్‌ జిల్లాల్లోని 193 మంది రైతులకు ఈ కార్యక్రమాన్ని విస్తరించారు.


చేపల పెంపకం
ఈ వ్యవస్థకు ప్రధానమైనది వర్షపు నీటిని సేకరించే చెరువు. దీన్ని చేపల పెంపకం, అదనపు నీటిపారుదల కోసం ఉపయోగిస్తారు. ఉదజని సూచిక (పిహెచ్‌)ని సరిచేయటానికి చెరువుల్లో సున్నం వేసి శుభ్రపరుస్తారు. ఆవు పేడతో కూడిన స్లర్రీ వెయ్యటం వల్ల నీటిలో ΄్లాంక్టన్‌(ప్లవకాలు) పెరుగుతాయి. ఇది చేపలకు సహజమైన మేతగా ఉపయోగపడుతుంది. రైతులు బొచ్చె తదితర మంచినీటి కార్ప్‌ చేపలను కలిపి ఒకే చెరువులో తగిన నిష్పత్తిలో పెంచుతారు. తక్కువ ఖర్చుతో ఇంట్లో తయారుచేసిన చేపల మేతను, నీటిపై తేలియాడే పెల్లెట్ల మేతను వేసి పెంచుతారు. క్రమం తప్పకుండా చేపల నమూనాలను సేకరించి పరీక్షిస్తూ మేత పద్ధతులను సర్దుబాటు చేస్తుంటారు.

సమీకృత సేద్యం ఓ పరిష్కారం 
వర్షపు నీటిని సేకరించి, ఆ నీటిపై ఆధారపడి చేసే సమీకృత వ్యవసాయ పద్ధతులు కేవలం ఆదాయాన్ని పెంచడమే కాకుండా, ఇంకా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవి వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి, పోషకాల వైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయి, నేల, నీటి వనరులను పరిరక్షిస్తాయి, భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం అస్తవ్యస్థంగా మారిపోవటం తీవ్రమవుతున్నందున, ఇటువంటి వికేంద్రీకృత, సమాజ ఆధారిత పరిష్కారాలు అత్యంత కీలకంగా మారాయి.

వర్షం పడిన చోటనే పొలంలోనే ఆ నీటిని సేకరించడం అత్యంత సరళమైన పద్ధతి. భారతదేశ ఆహార భవిష్యత్తును కాపాడటానికి ఇది అత్యంత శక్తివంతమైన వ్యూహాలలో ఒకటిగా నిలుస్తుందని ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ చెబుతోంది. సమీకృత వ్యవసాయ వ్యవస్థ నమూనాని రైతులందరికీ విస్తరించాల్సిన అవసరం ఉంది, దీనికి విధానపరమైన ప్రోత్సాహం, క్షేత్రస్థాయిలో రైతుల సామర్థ్యం పెంపుదల, సామాజిక భాగస్వామ్యం అవసరం. రైతులు వాన నీటిని ఒక ఉమ్మడి పర్యావరణ వనరుగా గుర్తించి ఒడిసిపట్టినప్పుడు వ్యవసాయం సుస్థిరతకు మరింత చేరువ అవుతుందని ఫౌండేషన్‌ సూచిస్తోంది.

అదేవిధంగా, రైతులు మెట్ట భూములలో ఖరీఫ్‌ కాలంలో రాగుల సాగును, ఖరీఫ్‌ చివరి కాలంలో ఉలవల సాగును చేపట్టారు. ఈ వైవిధ్యభరితమైన పంటల విధానం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రైతుల జీవనోపాధిని బలపరుస్తుంది. ఆహార భద్రతను ప్రోత్సహిస్తుంది. కుటుంబ పోషణకు తోడ్పడుతుంది.


వరి, రాగి పంటల గడ్డితో ఆయిస్టర్‌ పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వర్మీకంపోస్టు ఉత్పత్తి కేంద్రాల ద్వారా వ్యర్థాలను పునర్వినియోగిస్తున్నారు. తద్వారా రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గింది.

సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే సమీకృత వ్యవసాయ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. అంతకంటే ముఖ్యంగా, సంవత్సరం పొడవునా పంటల ద్వారానో, కోళ్ల ద్వారానో, చేపల ద్వారానో ఏదో ఒక ఆదాయం వస్తుంటుంది. దీనివల్ల కాలానుగుణ ఇబ్బందులు తగ్గి, రైతులు మరింత సురక్షితమైన జీవితాలను గడపడానికి వీలు కలుగుతోంది.

చెరువు గట్లపై పంటలు..
సాంప్రదాయకంగా ఉపయోగించకుండా వదిలేసే చెరువు గట్లపై అరటి, బొ΄్పాయి, మునగ, జామ, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి వంటి పండ్ల చెట్లను నాటుతున్నారు. చెరువు నీటితో చెరువు గట్లపైనా, దాన్ని ఆనుకొని ఉన్న భూముల్లోనూ ఏడాది పొడవునా కూరగాయలు పండిస్తున్నారు. మెట్ట భూములలో వరి తర్వాత పండించే పెసర, మినుము వంటి పప్పుధాన్యాలు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా, నేలను సారవంతం చేస్తున్నాయి. తద్వారా కాలక్రమేణా పెట్టుబడి ఖర్చులను తగ్గింది.

అదేవిధంగా, రైతులు మెట్ట భూములలో ఖరీఫ్‌ కాలంలో రాగుల సాగును, ఖరీఫ్‌ చివరి కాలంలో ఉలవల సాగును చేపట్టారు. ఈ వైవిధ్యభరితమైన పంటల విధానం నేల ఆరోగ్యాన్ని, రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. ఆహార భద్రతకు, కుటుంబ పోషణకు తోడ్పడుతోంది. వరి, రాగుల గడ్డితో ఆయిస్టర్‌ పుట్టగొడుగులు పెంచుతున్నారు. వర్మీకంపోస్టు తయారు చేస్తూ రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించుకుంటున్నారు.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement