ఇంటి పంట 9
కూరగాయ మొక్కలు పూత, కాత దశలో ఉన్నప్పుడు చీడపీడలు (ముఖ్యంగా ఆకు ముడత, తెల్ల దోమ లేదా పేనుబంక) రావడం సహజం. మిద్దెతోటల్లో వీటిని వదిలించుకోవడానికి రసాయనాల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే కషాయాలు బాగా పనిచేస్తాయి:
1. వేప నూనె స్ప్రే అన్నిటికన్నా ఉత్తమమైనది. ఒక లీటరు గోరువెచ్చని నీటిలో 5 ఎం.ఎల్. వేప నూనె, 2 స్పూన్లు శనగపిండి కలిపి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ఆకులపైన, ముఖ్యంగా ఆకుల వెనుక భాగంలో (అక్కడే పురుగులు ఎక్కువగా ఉంటాయి) స్ప్రే చేయాలి. దీన్ని వారానికి ఒకసారి సాయంత్రం వేళల్లో స్ప్రే చేస్తే పురుగులు మాయమవుతాయి.
2. అల్లం–వెల్లుల్లి–మిర్చి కషాయం – టమోటా, మిర్చి మొక్కలకు వచ్చే ఆకు ముడతకు ఇది బాగా పనిచేస్తుంది.
3. సమాన భాగాలుగా (50 గ్రాముల చొప్పున) అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేయాలి. దీన్ని లీటరు నీటిలో కలిపి ఒక రాత్రంతా ఉంచి, మరుసటి రోజు వడకట్టాలి.
4. ఇలా వాడకట్టిన లీటర్ ద్రావణం కు మరో 10 నుండి 15 లీటర్ల సాధారణ నీటిని కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి. ఈ ద్రావణం గాఢత ఎక్కువ ఉంటే మొక్కలు మాడిపోతాయి.
5. వేప నూనె లేదా అల్లం–వెల్లుల్లి కషాయాన్ని వారానికి ఒకసారి చొప్పున వరుసగా మూడు వారాలు స్ప్రే చేయాలి. ఒక్కసారి స్ప్రే చేస్తే పురుగులు పూర్తిగా పోవు, వాటి గుడ్లు కూడా నశించాలంటే క్రమం తప్పకుండా చేయాలి.
6. పురుగులు ఆకుల అడుగునా దాక్కుంటాయి, కాబట్టి స్ప్రే చేసేటప్పుడు ఆకులను పైకి ఎత్తి మరీ కొట్టాలి.
7. పుల్లటి మజ్జిగ (నిమ్మ మొక్కలకు): బాగా పులిసిన మజ్జిగను (3–4 రోజుల పాతది) నీటిలో కలిపి (1:5 నిష్పత్తి) మొక్కలపై స్ప్రే చేస్తే తెగుళ్లు తగ్గడమే కాకుండా, మొక్కకు మంచి పోషకాలు అందుతాయి.
8. 1 లీటరు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వంట నూనె, లిక్విడ్ సోప్ కలపాలి. ఆకులపై మచ్చలు లేదా బూజు ఉన్నప్పుడు దీనిని పిచికారీ చేయాలి.
9. ఆకు ముడతను వ్యాపింపజేసే తెల్లదోమలు, తామర పురుగులు పసుపు రంగుకు ఆకర్షితమవుతాయి. తోటలో అక్కడక్కడా పసుపు రంగు జిగురు అట్టలు కడితే పురుగులు వాటికి అతుక్కుపోతాయి. దీనివల్ల సమస్య పెరగకుండా ఉంటుంది.
10. ³క్షులను ఆకర్షించడం ద్వారా అంటే వాటికి ఏమైనా ఆహారం, నీరు అందిస్తే పక్షులు మిద్దె /పెరటి తోటకు రావటానికి అలవాటు పడి మొక్కలపై ఉన్న పురుగులను తింటాయి. ఇది సహజమైన నియంత్రణ పద్ధతి.
11. ఏ రకమైన కషాయం లేదా స్ప్రే అయినా సరే సాయంత్రం ఎండ తగ్గాక మాత్రమే చేయాలి. ఎండలో చేస్తే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది.
12. పూత మీద నేరుగా స్ప్రే చేయకూడదు. ఇది పరాగసంపర్కానికి అడ్డుపడవచ్చు. ఆకులపై మాత్రమే స్ప్రే చెయ్యాలి.
13. బాగా ముడత వచ్చి పాడైపోయిన ఆకులు లేదా కొమ్మలు ఉంటే, వాటిని తుంచేసి దూరంగా పారవేయాలి. అవి ఉంటే పురుగులు మళ్ళీ వ్యాపిస్తాయి.
14. మొక్కకు లోపలి నుండి బలం ఉంటేనే అది రోగాలను తట్టుకోగలదు. కాబట్టి మనం ఇంతకుముందు తెలుసుకున్న ద్రవ పశువుల ఎరువును 15 రోజులకు ఒకసారి అందిస్తూ ఉండాలి.
- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


