సాక్షి, హైదరాబాద్: గత 34 ఏళ్లుగా నగరవాసులకు సేవలందిస్తున్నన గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ శివారుకు తరలనుంది. కూరగాయలు, పూల వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ను రెండు విభాగాలుగా విభజించాలని నిర్ణయించారు. ఈ మేరకు అజీజ్నగర్లో కూరగాయలు, పండ్లు, హిమాయత్సాగర్లో పూల మార్కెట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుత మార్కెట్ స్థలం తక్కువ, రద్దీ ప్రాంతంలో ఉండడం కారణంగా రైతులు, కమీషన్ ఏజెంట్లు, హోల్సేల్ వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని మొయినాబాద్ మండలం అజీజ్నగర్ గ్రామంలోని సర్వే నం.176లో 23.2 ఎకరాల్లో కూరగాయల మార్కెట్, హిమాయత్సాగర్ గ్రామ సర్వే నం.151లో 19.10 ఎకరాల్లో పూల మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నేపథ్యం ఇదీ..
1991లో కార్వాన్ సబ్జీమండి గుడిమల్కాపూర్కు తరలింది. ఈ మార్కెట్ అప్పటి అవసరాలకు సరిపోయింది. కానీ నేడు నగరం 4 రెట్లు పెరిగింది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్కు రోజూ 2 వేలకు పైగా వాహనాలు వస్తాయి. పార్కింగ్, రహదారులు, పారిశుధ్యం వంటి సమస్యలున్నాయి. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ వంటి కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. రైతులు, కమీషన్ ఏజెంట్లు, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త ప్రణాళికకు రూపకల్పన చేసింది.
శివారు జిల్లాల రైతులకు ప్రయోజనం
కొత్తగా రానున్న అజీజ్నగర్, హిమాయత్సాగర్ మార్కెట్ల వల్ల నగరానికి ఆనుకుని ఉన్న వికారాబాద్, కొడంగల్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహబూబ్నగర్, నల్గొండ, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఓఆర్ఆరకు ఆనుకుని ఉండడం వల్ల రవాణా సమయం, వ్యయం తగ్గుతుంది. ఇక రాబోయే మార్కెట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిరి్మస్తారు. కోల్డ్ స్టోరేజ్, విశాలమైన పార్కింగ్ స్థలం, సారి్టంగ్, ప్యాకింగ్ జోన్లు, ఆధునిక డ్రైనేజ్, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, రైతు సేవా కేంద్రం, బ్యాంకు, క్యాంటీన్న్, కమీష¯Œన్ ఏజెంట్లకు ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేస్తారు.


