
నగరంలో ఫుడీస్, ఫుడ్ లవర్స్, భోజనప్రియులు.. పేరేదైనా కానీ.. విభిన్న వంటకాలు ఆస్వాదించేవారు పెరుగుతున్నారు. మరోవైపు రెస్టారెంట్స్లో మాత్రమే కాదు సంపన్నుల బఫే డిన్నర్స్లోనూ, పారీ్టస్లోనూ విభిన్న రకాల విదేశీ రుచుల వడ్డన సర్వసాధారణం అయ్యింది. అయితే కంటికి ఇంపైనంత మాత్రాన ఇంటికి ఇంపు కావాలని లేనట్టే, నోటికి ఇంపుగా అనిపించినంత మాత్రాన శరీరానికి ఇంపు కాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రుచుల వేట సాగించేవాళ్లు ముందస్తుగా ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్టు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం..
సాధారణంగా మనుషులు తినకూడని ఆహారాలు మనకి తెలుసు. తినదగినవీ తెలుసు. కానీ కొందరికి మాత్రమే తినదగినవి, కొందరు తినకూడనివి కూడా ఉంటాయి. అలానే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా కొన్నిసార్లు అస్వస్థతకు కారణమవుతాయి.
ఇవి జీర్ణక్రియ సమస్యలు, చర్మం మీద ర్యాషెస్, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలను కలిగించవచ్చు. అయితే ఎటువంటి ఆహారం అనారోగ్యానికి కారణమవుతుందో గుర్తించడం చాలా కష్టం. అనేక సందర్భాల్లో ఈ లక్షణాలు ఆహారం తిన్న కొన్ని గంటల తరువాత మాత్రమే బయటపడతాయి. ఈ క్రమంలో ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది.
ఫుడ్ అలర్జీ.. లక్షణాలు ఇలా..
ఆహారం పడకపోవడం వల్ల మొదటిగా చర్మంపై పొక్కులు, ఎర్రని దద్దుర్లు, నొప్పులు రావచ్చు. అయితే చిన్నపిల్లల్లో మొదటి లక్షణంగా చర్మంపై ర్యాష్ కనిపిస్తుంది. అలాగే శ్వాస సంబంధిత వ్యవస్థపై ప్రభావంతో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుదల, ముక్కు పొంగడం వంటి సమస్యలు కలగవచ్చు.
జీర్ణ వ్యవస్థపై దాడితో.. నాలుక ఉబ్బిపోవడం, బొజ్జ నొప్పి, నోటిలో మెటాలిక్ రుచి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అనాఫిలాక్టిక్ షాక్ అనే తీవ్ర పరిస్థితి ఏర్పడినప్పుడు వేగంగా నాడీ స్పందన, పెదవులు, గొంతు ఉబ్బిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం తెల్లగా కనిపించడం, మూర్ఛ వంటివి కూడా రావచ్చు.
నప్పనివి ఏమిటి?
సాధారణంగా నప్పని ఆహారాల్లో పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, షెల్ ఫిష్, పీనట్స్, వాల్నట్, ఆల్మండ్, కాజు, పీకాన్ వంటి డ్రై ఫ్రూట్స్.. అయితే ఇవి నప్పకపోవడానికి వాటిలో ఉండే కొన్ని ఉపపదార్థాలు కూడా కారణమే.
ఉదాహరణకు పాలలో ఉండే లాక్టోజ్ అనే ఒక రకమైన తియ్యటి పదార్థం, గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రొటీన్, ఫుడ్ ఫ్లేవర్ పెంచడానికి ఉపయోగించే ఎంఎస్జీ అనే పదార్థం.. ఇలా.. కొన్ని సందర్భాల్లో అతి తక్కువ మోతాదులో ఈ ఆహారాలను తీసుకున్నా తీవ్ర సమస్యలకు కారణం కావచ్చు. అలాగే మనకు ఏ మాత్రం పరిచయం లేని వంటకాల్లో ఏయే దినుసులు కలుపుతున్నారో వాటిలో ఏవి మనకు నప్పవో తెలీదు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం.
ఆహారం.. అసహనం..
మన శరీరానికి హానికరం కాని ఆహారాలను హానికరమైన వైరస్లా గుర్తించి స్పందించే స్థితి కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు చిన్నపాటి జీర్ణ సమస్యలుగా ఉంటే, మరికొన్నిసార్లు అనాఫిలాక్టిక్ షాక్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. ఈ సమస్య చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా 5 శాతం కంటే ఎక్కువ మంది చిన్నారులు దీని ప్రభావానికి లోనవుతున్నారు. చాలామంది పిల్లలు పెద్దయ్యాక ఈ అసహనాన్ని సహనంగా మార్చుకోగలుగుతారు. కానీ కొందరు మాత్రం కొన్నింటిని నప్పేలా చేసుకుంటారు కొన్నింటి పట్ల అసహనాన్ని కొనసాగిస్తారు.
ఫుడ్ అలర్జీ పరీక్షలు.. ఎలా? ఎక్కడ?
అనుమానాస్పద ఆహారాన్ని స్వల్పంగా ప్రయోగించి శరీరం ఎలా స్పందిస్తుందో పరిశీలించడాన్ని ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు. అలాగే అనుమానాస్పద ఆహారాలను పూర్తిగా ఆపి, తర్వాత ఒక్కొక్కటిగా మళ్లీ ఆహారంలో చేర్చడాన్ని ఎలిమినేషన్ డైట్, ఆహారాన్ని చర్మంపై ఉంచి సూదితో తక్కువగా గుచ్చి చేసే స్కిన్ ప్రిక్ టెస్ట్, రక్తంలో ఐజీఇ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది పరీక్షించడానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు.
నగరంలో థైరోకేర్, మై డయాగ్నోస్టిక్స్, డీఎన్ఎ ల్యాబ్స్ ఇండియా, రెడ్ క్లిఫ్ ల్యాబ్స్, ల్యూసిడ్.. వంటి చోట్ల ఈ పరీక్షలు చేస్తున్నారు. కనీసం 200 రకాలు.. ఆ పైన అలర్జీలను గుర్తించేందుకు చేసే పరీక్షల వ్యయం కనీసం రూ.5వేల నుంచి రూ.15వేల వరకూ అవుతుంది.
(చదవండి: ఆ జంట పిల్లలు కోసం సరోగసికి వెళ్తే.. ఊహకందని ట్విస్ట్! చివరికి..)