జపాన్లోని కగావా శాస్త్రవేత్తలు సరికొత్త విప్లవాత్మక సాంకేతికతకు తెరలేపారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి పెను సవాలుగా మారుతున్న ఆహార వ్యర్థాల సమస్యకు వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. హోటళ్లలో మిగిలిపోయి, పారేసే ‘ఉడాన్ నూడుల్స్’ తో పర్యావరణహిత, బయోడిగ్రేడబుల్ (జీవ విచ్ఛిన్నం చెందే) కాగితాన్ని తయారు చేసి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, వ్యర్థాలను అద్భుతమైన వనరుగా మార్చిన ఈ పరిశోధన వివరాలు ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగంలో సంచలనంగా మారాయి.
ప్రత్యేక నూడుల్స్.. పెరిగిపోతున్న వ్యర్థాలు
జపాన్లోని కగావా ప్రిఫెక్చర్ ‘సానుకి ఉడాన్’ అనే ప్రాంతీయ నూడుల్స్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఈ రుచికరమైన వంటకాన్ని ఆస్వాదించడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అంతే స్థాయిలో ఇక్కడ ఆహార వృథా కూడా జరుగుతోంది. స్థానిక రెస్టారెంట్లలో అమ్ముడుపోని నూడుల్స్, అలాగే ఉడకబెట్టిన తర్వాత ఎక్కువ సమయం ఉంచడం వల్ల రుచి కోల్పోయిన నూడుల్స్ను భారీ మొత్తంలో పారేయాల్సి వస్తోంది. ఈ తీవ్రమైన ఆహార వృథా సమస్యను అరికట్టాలనే లక్ష్యంతో పరిశోధకులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
ప్రొఫెసర్ తనకా వినూత్న ఆలోచన
కగావా యూనివర్సిటీ అగ్రికల్చర్ ఫ్యాకల్టీకి చెందిన ప్రొఫెసర్ నవోటాకా తనకా నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. సూక్ష్మజీవులు, సెల్యులోజ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాపై ఆయన చేసిన సుదీర్ఘ పరిశోధనల ఆధారంగా ఈ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ‘మా ప్రాంతంలో భారీ మొత్తంలో ఉడాన్ నూడుల్స్ వృథాగా పారేయడం నన్ను ఆలోచింపజేసింది. వీటిని రీసైకిల్ చేయడం ద్వారా ఆహార వ్యర్థాలను తగ్గించవచ్చని భావించాను’ అని ప్రొఫెసర్ తనకా తెలిపారు. నూడుల్స్ను చక్కెరగా మార్చే ప్రక్రియ చాలా సులభం కావడంతో ఆయన ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు.
నూడుల్స్ నుండి కాగితం తయారీ ఇలా..
సాధారణ కాగితం తయారీ పద్ధతులకు భిన్నంగా, ఈ ప్రక్రియలో అధునాతన జీవ సాంకేతికతను ఉపయోగించారు. మొదటగా మిగిలిపోయిన నూడుల్స్ను నీటితో కలిపి మిశ్రమంగా మారుస్తారు. ఆ తర్వాత, అందులోని పిండి పదార్ధాన్ని గ్లూకోజ్గా మార్చడానికి కొన్ని ప్రత్యేక ఎంజైమ్లను జోడిస్తారు. ఈ మిశ్రమానికి ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చేర్చిన కొద్ది రోజుల్లోనే, ఆ మిశ్రమం పైభాగంలో బ్యాక్టీరియా ఒక సెల్యులోజ్ పొరను ఏర్పరుస్తుంది. ఆ పొరను జాగ్రత్తగా ట్రేలలో ఉంచి, సహజ గాలిలోనే ఆరబెట్టడం ద్వారా జపాన్ సాంప్రదాయ ‘వాషి’ కాగితం లాంటి పలచని షీట్లు సిద్ధమవుతాయి.
అద్భుతమైన మన్నిక.. పర్యావరణానికి మేలు
ఒక్క ప్లేట్ ఉడాన్ నూడుల్స్ వ్యర్థాల నుండి దాదాపు 5 నుండి 10 వరకు ఏ4 సైజు కాగితాలను తయారు చేయవచ్చు. ప్రొఫెసర్ తనకా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోబియల్ పేపర్ సాధారణ కాగితం కంటే చాలా తేలికగా ఉండటమే కాకుండా, నీటిని తట్టుకునే శక్తిని, మన్నికను కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, వాడేసిన తర్వాత మట్టిలో పడేసినా, సూక్ష్మజీవుల సహాయంతో ఇది చాలా వేగంగా, సహజంగా కలిసిపోతుంది. నిజానికి ఈ సాంకేతికతను ప్రొఫెసర్ సుమారు 16 ఏళ్ల క్రితమే విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా చూపించడానికి అభివృద్ధి చేయడం గమనార్హం.
అడ్డంకులను అధిగమించి స్థిరమైన ఉత్పత్తి
2020 సంవత్సరంలో, ఈ సాంకేతికతను స్థానిక సామాజిక సేవా సంస్థకు విశ్వవిద్యాలయం ఉచితంగా అందించింది. దీని ద్వారా వికలాంగులకు ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రారంభంలో బ్యాక్టీరియా కాలుష్యం, బూజు పట్టడం వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఉష్ణోగ్రత నియంత్రణ పెట్టెలను ఉపయోగించి నాణ్యమైన ఉత్పత్తిని సాధించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో నెలకు సుమారు 100 కాగితపు షీట్లను తయారు చేస్తున్నారు. వీటిని విశ్వవిద్యాలయమే కొనుగోలు చేస్తోంది. తద్వారా రెస్టారెంట్లు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలతో కూడిన ఒక బలమైన స్థానిక రీసైక్లింగ్ నెట్వర్క్ ఏర్పడింది.
భవిష్యత్ ప్రణాళికలు.. పరస్పర సహకారం
ఈ పర్యావరణహిత కాగితాన్ని ఇప్పటికే ప్రచార సామగ్రి, కళాఖండాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు దీనిని నీటిలో కరిగిపోయే చేపల ఎరగా ఉపయోగించే అంశంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు, నూడుల్స్ వ్యర్థాలను అందించే రెస్టారెంట్లకు విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సహాయం చేస్తోంది. వాతావరణ మార్పులు, ఆహార వినియోగ అంచనాలకు సంబంధించిన డేటాను వారికి అందిస్తూ, ముందస్తుగా ఆహార వృథాను అరికట్టేలా ప్రోత్సహిస్తోంది. ఈ వినూత్న ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యర్థాల నిర్మూలనకు ఒక గొప్ప రోల్ మోడల్గా మారుతుందని ప్రొఫెసర్ తనకా ఆశాభావం వ్యక్తం చేశారు.


