సతీ భూదేవి

Bhudevi Great Fight for his Husband - Sakshi

యముడితో పో రాడి భర్తప్రా ణాలు తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి కథ మనకు తెలుసు.  చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న భర్తను పరాయి దేశం నుంచి విడిపించుకుని రావడానికి పద్నాలుగేళ్లు పోరాటం చేసింది ఈ భూదేవి. నేడు వేలంటైన్స్‌ డే. ప్రేమకు పట్టం కట్టే రోజు.  భర్త పట్ల భార్యకు ఎంత ప్రేమ ఉంటుందో... అతని శ్రేయస్సు కోసం ఆమె ఎంత తపన పడుతుందో ఈ రోజున ఈ ఘటన ద్వారా కాకుండా మరెలా తెలుసుకుంటాం?  భార్య ప్రేమకు శక్తి ఉంటే అది ఇంత బలంగా ఉంటుంది.  ఇంత అచ్చెరువొందేలా కూడా ఉంటుంది. 

తీవ్రవాదుల చెరలో బందీగా ఉన్న తన భర్తను విడిపించుకోవడానికి ‘రోజా’ సినిమాలో హీరోయిన్‌ తెగువను ఆస్వాదించాం. అచ్చం అలాంటి కథను పో లిన నిజజీవిత ఘటన తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యాగంధం ఏమంతగా అంటని మాకూరి భూదేవి మరణశిక్ష ఖరారైన తన భర్తకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుదీర్ఘ న్యాయపో రాటం చేసి విజేతగానే కాదు, వార్తలలో కూడా నిలిచింది. భూదేవి 14 ఏళ్లుగా చేసిన న్యాయపో రాటానికి ఇటీవల ఫలితం దక్కింది. ఇప్పుడు భూదేవి, ఆమె కుమారుడు రాజు, భర్త శంకర్‌ ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు.

అసలేం జరిగిందంటే...
మెండోరాకు చెందిన మాకూరి శంకర్‌కు సెంటు కూడా వ్యవసాయ భూమి లేదు. ఇక్కడ కూలి పని చేస్తే పెద్దగా సంపా దించుకోవడం కష్టం అనుకున్నాడు. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో 2004లో దుబాయ్‌కు వెళ్లిపో యాడు. అక్కడ ఒక నిర్మాణ సంస్థలో ఫోర్‌మెన్‌ (సూపర్‌వైజర్‌)గా చేరాడు. అతనికింద పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రామావతార్‌ కుమావత్‌ ప్రమాదవశాత్తు భవనం ఆరో అంతస్థుపై నుంచి పడి చనిపో యాడు.

ఫోర్‌మెన్‌గా ఉన్న శంకర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రాజస్థాన్‌ వాసి మరణించాడని దుబాయ్‌ పో లీసులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను హత్య కేసుగా నమోదు చేసిన అక్కడి పో లీసులు శంకర్‌ను ప్రధాన నిందితునిగా గుర్తించి అరెస్టు చేసి పుజీరా జైలులో పెట్టారు. కోర్టు విచారణలో రామావతార్‌ కుమావత్‌ మృతికి తను బాధ్యుణ్ణి కాదని, అతను ప్రమాదవశాత్తు మరణించాడని శంకర్‌ ఎంత మొరపెట్టుకున్నా దుబాయ్‌ కోర్టులో చెల్లలేదు. పో లీసుల విచారణ నివేదిక ప్రకారం శంకర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 2013లో మరణశిక్షను ఖరారు చేసింది. 

చదువులేకపో యినా...
ఈ ఘటన 2009లో చోటు చేసుకుంది. మాకూరి శంకర్‌కే కాదు అతని భార్యకు కూడా చదువు రాదు. ఎవరిని సంప్రదించాలో, తమకేవిధంగా న్యాయం జరుగుతుందో తెలియదు. పుజీరా జైలులో ఉన్న శంకర్‌కు తన భార్య భూదేవితో నెల రోజులకు ఒకసారి ఫోన్‌లో మాట్లాడేందుకు జైలు పో లీసులు అవకాశం కల్పించారు. ‘‘అప్పుడు ఆయన నా గురించి, మా అబ్బాయి గురించి అడిగి ఏడ్చేవాడు. తాను బతికి బట్టకట్టాలంటే రాజస్థాన్‌ వాసి రామావతార్‌ కుమావత్‌ కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించాలని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కుటుంబం అడ్రస్‌ తెలియదు. మా ఊళ్లో పెద్దలందరికీ ఈ విషయం చెప్పాను. కనపడినవారికల్లా మా కష్టం చెప్పాను. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని ఏడ్వనిరోజు లేదు.

రోజూ దిగులుగా ఉండేది. అలాగే నెలలు, ఏళ్లు గడిచిపో తున్నాయి. కానీ, దిగులుగా కూర్చుంటే అయ్యే పనులు కావు. నేనూ, నా బిడ్డ బతకాలి. కూలి పనులు చేసుకుంటూ బిడ్డను పో షించుకుంటూ వచ్చాను. గతంలో ఆర్మూర్‌ మండలం దేగాం వాసులు ముగ్గురు దుబాయ్‌లో మరణశిక్ష నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నారని తెలిసింది. ఇందుకు అదే గ్రామానికి చెందిన యాదాగౌడ్‌ కృషి చేశారని తెలిసింది. గంపెడాశతో వెళ్లి యాదాగౌడ్‌ను సంప్రదించి ఎలాగైనా నా భర్తను మరణశిక్ష నుంచి తప్పించాలని వేడుకున్నాను..’ అని ఇన్నేళ్ల తన కష్టాన్ని వివరించింది భూదేవి.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి...
‘మా ఆయనకు ఫోన్‌ చేసినప్పుడల్లా ఊళ్లో విషయాలు, నేను చేస్తున్న పనుల గురించి, మా అబ్బాయి క్షేమం గురించి చెబుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని చెబుతూ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేదాన్ని. బాధిత కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించాలని కానీ, వాళ్లు ఎక్కడ ఉంటారో నాకు తెలియదని యాదాగౌడ్‌ను కలిసినప్పుడు చెప్పాను. అతను అన్ని వివరాలు కనుక్కొని, రాజస్థాన్‌ కుటుంబం గురించి తెలుసుకున్నాడు. వాళ్లకు ఆర్థికసాయం రూ.5 లక్షలు అందించాలంటే అందరినీ బతిమాలుకున్నాను. కూలీ చేసుకొని బతికేదాన్ని, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది.

మా ఊరి వాళ్లు, ఇంకొంతమంది దయగలవాళ్లు తమకు తోచినంత ఇచ్చారు. అలా వచ్చిన డబ్బును రాజస్థాన్‌లోని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశాం. మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించారు’ అని తెలిపింది భూదేవి. అలా వారు సంతకాలు చేసిన పత్రాలను యాదాగౌడ్‌ ద్వారా  న్యాయవాది అనురాధ సహకారంతో భూదేవి దుబాయ్‌లోని కోర్టుకు పంపించింది. దుబాయ్‌ కోర్టు ఈ పత్రాలను పరిశీలించి మరణశిక్షను రద్దు చేయడమేకాకుండా  అతన్ని విడుదల చేస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో మరణశిక్షను తప్పించుకున్న శంకర్‌ ఇంటికి చేరుకున్నాడు. కథ సుఖాంతమైంది.

మా వాళ్లను చూస్తానని అనుకోలేదు
నేను దుబాయ్‌కు వెళ్లే సమయంలో నా భార్య గర్భవతి. కొన్ని నెలలకే కొడుకు పుట్టాడు. ఈ సంతోష వార్త వినే సమయంలో నా భార్యకు చెప్పాను ‘త్వరలోనే వస్తాను’ అని. కానీ, అది సాధ్యం కాదని తర్వాత తెలిసింది. రాజస్థాన్‌ వ్యక్తి మరణించడంతో నేను ఈ ఘటనలో అరెస్టు అయ్యి జైలుపా లు కావడం, ఆ తరువాత మరణశిక్ష పడటం వరుసగా జరిగాయి. ఇక నా వాళ్లను చూస్తానని కలలో కూడా అనుకోలేదు. నా భార్యతో ఫోన్‌లో మాట్లాడిన ప్రతిసారీ నాకు ఎంతో ధైర్యం చెప్పేది. జైల్లో ఎంతో మనోవేదనతో ఉన్నా నా భార్య మాటలు నాకు జీవితంపై ఆశలు చిగురించేలా చేశాయి. నా విడుదల కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. – మాకూరి శంకర్‌

– ఎన్‌.చంద్రశేఖర్,  సాక్షి, మోర్తాడ్, నిజామాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top