సముద్రంపై  సాహస  సంతకం | 11 Indian women military officers set to circumnavigate the globe | Sakshi
Sakshi News home page

సముద్రంపై  సాహస  సంతకం

Apr 8 2025 4:19 AM | Updated on Apr 8 2025 4:19 AM

11 Indian women military officers set to circumnavigate the globe

నారీ శక్తి

‘జీరో’ అంటే చాలామందికి చిన్న చూపు. అయితే ఎంత పెద్ద విజయమైనా ‘జీరో’ తోనే మొదలవుతుంది. హీరోలను చేస్తుంది. తాజా విషయానికి వస్తే....  త్రివిధ దళాలకు చెందిన 11 మంది మహిళా అధికారులు  హిందూ మహాసముద్రంలో 55 రోజుల ‘సముద్ర ప్రదక్షిణ’కు శ్రీకారం చుట్టారు. గతంలో వీరికి సముద్ర సాహస యాత్ర అనుభవం లేదు.   జీరో నుంచి మొదలు పెట్టి ప్రతి విషయాన్నీ ఓపికగా నేర్చుకొని సాహసయాత్రకు కదిలారు.

హిందూ మహాసముద్రం స్త్రీ శక్తికి వేదిక కానుంది. త్రివిధ దళాలకు చెందిన పదకొండుమంది మహిళా అధికారులు నిన్నటి (సోమవారం) నుంచి హిందూమహాసముద్రంలో ‘సముద్ర ప్రదక్షిణ’ మొదలుపెట్టారు. ముంబైలోని ఇండియన్‌ నేవల్‌ వాటర్‌ మ్యాన్‌షిప్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఐఎన్‌డబ్ల్యూటీసీ) ఈ యాత్రప్రారంభ కేంద్రం. 55 రోజుల్లో హిందూ మహా సముద్రంలోని 4,000 నాటికల్‌ మైళ్లను ఈ  బృందం అధిగమించనుంది. వీరిలో ఆరుగురు ఆర్మీ అధికారులు, ఒక నేవీ అధికారి, నలుగురు వైమానిక దళ అధికారులు ఉన్నారు.

త్రివిధ దళాల నుంచి...
భారత సైన్యం నుంచి లెఫ్టినెంట్‌ కల్నల్‌ అనుజ, మేజర్‌ కరంజీత్, మేజర్‌ తాన్యా, కెప్టెన్‌ ఒమితా, కెప్టెన్‌ దౌలీ, కెప్టెన్‌ ప్రజక్త, భారత వైమానిక దళం నుంచి స్క్వాడ్రన్‌ లీడర్‌ విభా, స్క్వాడ్రన్‌ లీడర్‌ శ్రద్ధ,  స్క్వాడ్రన్‌ లీడర్‌ అరువి, స్క్వాడ్రన్‌ లీడర్‌ వైశాలి, భారత నావికాదళం నుంచి లెఫ్టినెంట్‌ కమాండర్‌ ప్రియాంక ఈ బృందంలో ఉన్నారు.

కఠినమైన ఎంపిక ప్రక్రియ
ఈ సాహస యాత్రకు ఎంపిక ప్రక్రియ ఏడాది పాటు కొనసాగింది. ఎంపికకు ఫిజికల్‌ ఫిట్‌నెస్, టీమ్‌ అండ్‌ లీడర్‌షిప్‌ క్వాలిటీస్, అకడమిక్‌ నాలెడ్జ్, బోట్‌–హ్యాండ్లింగ్‌ కేపబిలీటీస్‌... మొదలైన వాటినిప్రామాణికంగా తీసుకున్నారు. త్రివిధ దళాలకు చెందిన 41 మంది మహిళా అధికారుల బృందం నుంచి 11 మంది మహిళా అధికారులను సముద్ర సాహస యాత్ర కోసం ఎంపిక చేశారు.


పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంజనీరింగ్‌ పరిధిలోని ‘ఆర్మీ అడ్వెంచర్‌ నోడల్‌ సెంటర్‌ ఫర్‌ బ్లూ వాటర్‌ సెయిలింగ్‌’లో త్రివిధ దళాల మహిళా అధికారులు రెండు సంవత్సరాల పాటు కఠోర శిక్షణ ΄÷ందారు, ఈ బృందం జీరో నుంచి శిక్షణ మొదలుపెట్టింది. నౌకాయానానికి సంబంధించిన సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలలోప్రావీణ్యం సాధించారు. సముద్రయానానికి అవసరమైన శారీరక బలాన్ని సమకూర్చుకున్నారు. 

నావిగేషన్, వాతావరణ శాస్త్రం, సీమన్‌షిప్‌ గురించి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్, రిపేర్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లాంటి సెయిలింగ్‌ నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. రూట్‌ ΄్లానింగ్, వెదర్‌ ఫోర్‌ కాస్టింగ్, ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్, స్టాకింగ్‌ అండ్‌ సేఫ్టీ ్రపోటోకాల్స్‌తోపాటు అంతర్జాతీయ సముద్ర చట్టాల గురించి కూడా తెలుసుకున్నారు.

చిన్న అడుగులతో పెద్ద సాహసం వైపు...
మొదట షార్ట్‌ డే ట్రిప్స్‌ చేసేవారు. భవిష్యత్‌ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమలోని నైపుణ్యాలకు పదును పెట్టడానికి, సముద్ర ప్రయాణానికి సిద్ధం కావడానికి ముంబై నుండి గోవా, కొచ్చి, పోర్‌బందర్, లక్షద్వీప్‌ వరకు ఎన్నో యాత్రలకు వెళ్లారు. అయితే ఊహించని వాతావరణ పరిస్థితుల నుంచి సాంకేతిక సమస్యల వరకు సముద్ర యాత్రలో అడుగడుగునా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి సవాలు నుంచి పాఠం నేర్చుకున్నారు. అధికారిక నౌక ఇండియన్‌ ఆర్మీ సెయిలింగ్‌ వెసెల్‌(ఐఎఎస్వీ)‘త్రివేణి’ నుంచి మొదలైన ఈ ప్రపంచ యాత్ర చరిత్ర సృష్టించనుంది.‘నారీశక్తి’ స్ఫూర్తితో మొదలైన ఈ ప్రయాణం చారిత్రాత్మకమే కాకుండా భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.
 

పంచభూతాల సందేశం
సముద్రంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సాహసికులుగా త్రివిధ దళాల మహిళా జట్టు ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పనుంది. ఈ యాత్ర కేవలం సముద్రయానం మాత్రమే కాదు మహిళా సాధికారతకు శక్తిమంతమైన ప్రతీక. మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు వారు మహా సముద్రాలను కూడా జయించగలరు అని పంచభూతాల సాక్షిగా ఇచ్చే శక్తిమంతమైన సందేశం.

యాత్ర లక్ష్యం
ముంబై నుంచి సీషెల్స్‌ వరకు మా మొదటి అంతర్జాతీయ యాత్ర మొదలైంది. రోజుల తరబడి, వారాల తరబడి భూమికి దూరంగా లోతైన జలాల్లో సాగే ఈ యాత్ర మా సహనానికి, నావిగేషన్‌ నైపుణ్యాలకు పరీక్ష. మహిళా సాధికారతలో బలాన్ని చూపించడమే ఈ యాత్ర లక్ష్యం.

– కెప్టెన్‌ దౌలీ

Advertisement
 
Advertisement
Advertisement