కుమారుడి ఆత్యహత్య
నూజివీడు: తల్లి మందలించిందని క్షణికావేశంలో పోలవరం కుడి కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి ఉదంతమిది. వివరాల ప్రకారం... నూజివీడు పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీకి చెందిన పిల్లి రామారావు, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు పిల్లి మహేష్ (26) బైక్ మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంటివద్ద తల్లి చెప్పిన పని అతను చేయలేదు. దీంతో ఆ తల్లి కొడుకుని మందలించింది. ఆ తరువాత ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లిన మహేష్ నేరుగా విజయవాడ రూరల్ మండలం, నున్న సమీపంలోని పోలవరం కుడి కాల్వ వద్దకు వెళ్లాడు. అక్కడ తన బండి, ఫోన్ వదిలేసి కాల్వలో ఉద్ధృతంగా వస్తున్న నీటి ప్రవాహంలోకి దూకాడు. సాయంత్రమైనా మహేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని ఫోన్కు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేదు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఫోన్ లొకేషన్ పరిశీలించగా, పోలవరం కాల్వ వద్ద ఉన్నట్లు చూపించింది. హుటాహుటిన అక్కడకు వెళ్లి చూడగా బైక్, ఫోన్ అక్కడే లభించడంతో, అతను కాల్వలో దూకి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. బుధవారం వేకువజాము నుంచే మహేష్ స్నేహితులందరూ కలిసి పోలవరం కుడి కాల్వ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు వద్ద పోలవరం కాల్వలో మహేష్ మృతదేహం కనిపించింది. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


