● నీటమునిగిన వంతెనలు
● జలదిగ్బంధంలో 16 గ్రామాలు
వేలేరుపాడు: గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి గోదావరి నీటిమట్టం 33 అడుగులకు చేరుకోవడంతో వేలేరుపాడు మండలంలో దిగువ ప్రాంతంలోని ఎద్దెలవాగు నీట మునిగింది. దీంతో దిగువ ఉన్న 16 గిరిజన గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దిగువ ప్రాంతంలోని కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్లగొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, ఎడవల్లి, బుర్రెడ్డిగుడెం, టేకూరు, సిద్దారం, కుంకుడుకొయ్యలపాకలు, మరో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎద్దెలవాగు వద్ద అధికారులు నాటు పడవను ఏర్పాటు చేశారు.
ఉధృతంగా గోదావరి
పోలవరం రూరల్: గోదావరిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉప నదుల నీటితో పాటు శబరి నీరు కూడా చేరడంతో ప్రవాహం మరింత పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. పోలవరం స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 5.69 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. దిగువన ఉభయగోదావరి జిల్లాల మధ్య లంక ఒడ్డులను తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 34.10 అడుగులకు నీటిమట్టం చేరుకుని 5.72 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది.
ముంపులోకి గుండేటివాగు వంతెన
కుక్కునూరు : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి వరద తీవ్రత పెరిగింది. బుధవారం భద్రాచలం వద్ద 30 అడుగులకు పైగా చేరిన వరదతో కుక్కునూరు సమీపంలోని గుండేటివాగు వంతెన నీట మునిగింది. దీంతో కుక్కునూరు మీదుగా దాచారం, వేలేరుపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పట్టిసీమ శివక్షేత్రం చుట్టూ ఉధృతంగా గోదావరి
నీట మునిగిన గుండేటి వాగు వంతెన
ఎడవల్లి వద్ద పడవ దాటుతున్న గిరిజనులు


