ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో చినవెంకన్న దివ్య పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో అర్చకులు విష్వక్సేన తదితర విశేష పూజలు, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం అంకురార్పణను నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు పుట్టమన్నును తెచ్చి పాలికల్లో పోసి అంకురార్పణ క్రతువు పూర్తిచేశారు. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. గురువారం పవిత్రాదివాసాన్ని నిర్వహించనున్నట్టు అర్చకులు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు.
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర లోకాయుక్త చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ టి.మల్లికార్జునరావు బుధవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, దే వస్థానం డీఈఓ వై.భద్రాజీ స్వామివారి చి త్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆల య ఏఈఓ పి.నటరాజారావు ఉన్నారు.
కైకలూరు: చిత్తడి నేలల పరిరక్షణ చట్టం అమలు చేస్తే కొల్లేరు పరీవాహక 10వ కాంటూరు వరకు 1.60 లక్షల ప్రైవేటు భూములకు నష్టం వాటిల్లుతోందని, సమష్టిగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని వాయిస్ ఆఫ్ కొల్లేరు (సమగ్ర పరిరక్షణ, సాధికారత కోసం కొల్లేరు స్వచ్ఛంద కార్యకర్తల సంస్థ) అధ్యక్షుడు శివాజీరాజు పిలుపునిచ్చారు. కైకలూరులో సంస్థ కార్యాలయంలో బుధవారం అత్యవసర సమవేశం నిర్వహించారు. ఈ చట్టం అమలు జరిగితే కొల్లేరు పరీవాహక ప్రాంతంలో 18 మండలాలు, 6 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో గ్రామాలు, పట్టణాలతో సహా 1,61,000 ఎకరాల వ్యవ సాయ, ఆక్వాకల్చర్ భూములన్నీ వెట్ల్యాండ్స్ నిబంధనల పరిధిలోకి వస్తాయన్నారు. దీని వల్ల ఆస్తి విలువల్లో అపారమైన నష్టంతో పాటు రైతులపై భారీ ఆర్థిక ప్రభావం పడుతుందన్నారు. కొల్లేరు వాయిస్ ఆఫ్ కౌన్సిల్ కార్యదర్శి గంగాధరం మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతం 10వ కాంటూరు వరకు 2,25,000 ఎకరా ల విస్తీర్ణంలో ఉందని అధికారులు నివేదికలు పంపుతున్నారని, వాస్తవానికి 100 చదరపు మైళ్ల (64,000 ఎకరాలు) విస్తీర్ణంలో కొల్లేరు ఉందన్నారు. కొల్లేరు వెలపల భూమిని చిత్తడి నెలల పరిధిలోకి తీసుకురావడం సరికాదని, సుప్రీంకోర్టులో కొనసాగుతున్న రిట్ పిటిషన్లో జోక్యం చేసుకోవడంతో సహా చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామన్నారు.


