● ఏలూరు జీజీహెచ్లో నిరసన దీక్ష
● అత్యవసర సేవల బహిష్కరణ
ఏలూరు టౌన్: ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) సమ్మె సైరన్ మోగించారు. ఏలూ రు సర్వజన ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యసేవలను బహిష్కరించి ఆందోళనను ఉధృతం చేశారు. ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్ సమీపంలో రోడ్డుపై నిరసన దీక్ష చేపట్టారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ బోధనాసుపత్రిలోడాలు వైద్యసేవలకు వెళ్లకుండా సమ్మె చేయటంతో రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. రోజూ వందలాది మంది ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఏలూరు జీజీహెచ్కు వైద్య చికిత్సలకు వస్తూ ఉండగా జూడాల సమ్మెతో సేవల్లో జాప్యం జరుగుతుందని చెబుతున్నారు. నిరసన దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఏలూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగం జూనియర్ అసిస్టెంట్ డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపుతో ఏలూరు జీజీహెచ్లోనూ సమ్మె చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో జూడలకు అత్యధిక స్టైఫండ్ ఇస్తుంటే ఇక్కడ మాత్రం తక్కువ ఇవ్వటం న్యాయం కాదన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న జూడాలకు 15 శాతం స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు, అలాగే వైద్యుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కొత్తగా వైద్యులుగా వస్తున్న వారికి అవకాశాలు కల్పించాలంటే రిటైర్మెంట్ వయసు తగ్గించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్స్లో మహిళ వైద్యులకు రాత్రివేళ భద్రత కల్పించటం, మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు.


