ఎస్పీ కేపీ శివకిషోర్
ద్వారకాతిరుమల: పోలీస్ స్టేషన్లలో కేసుల దర్యాప్తు, సూపర్విజన్, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ తెలిపారు. ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్రశక్తి పథకం వల్ల ద్వారకాతిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని, అదనపు హోంగార్డులు, వలంటీర్లతో భద్రతను బలోపేతం చేస్తూ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో గంజాయి వినియోగం, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కోర్టులో నేరాలను సమర్థంగా నిరూపించి శిక్షలు పడేలా చూడాలని, రికార్డులను ఆధునీకరించాలని ఆదేశించారు. ఏలూరులోని శక్తి పోలీస్స్టేషన్ను ఆదర్శంగా తీర్చిదిద్దామని, మహిళలకు మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపారు. బస్సుల్లో 1972 హెల్ప్లైన్ అవగాహన స్టిక్కర్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు సిబ్బంది బయట ఉండడానికే మొగ్గు చూపుతుండటంతో, కొత్త క్వార్టర్ల నిర్మాణం కంటే ఉన్న స్థలాల సమర్థ వినియోగంపై దృష్టి పెట్టామన్నారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఉన్నారు.


