ఏలూరు (ఆర్ఆర్పేట) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీఓ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల విద్యార్థి సమాఖ్య (పీఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. జిల్లా నాయకులు పి.శివశంకర్, టి.ఉదయ్కుమార్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో విఫలమై, పేపర్ లీకేజీలకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. నీట్ పరీక్షలనుయాజమాన్యాలకే కాకుండా, ఆయా రాష్ట్రాలే నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీల వల్ల ఆత్మహత్య చేసుకున్న 120 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి. విద్యావ్యవస్థలో ప్రభుత్వాల తరఫున జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. ప్రగతి నారీ సంఘం జిల్లా కార్యదర్శి జి.శారద తదితరులు పాల్గొన్నారు.


