ఏలూరు (ఆర్ఆర్పేట) : ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోపు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి స్థాయి మరింత పెంచేలా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం అందించాలని ఆదేశించారు. జేసీ ఎంజే అభిషేక్గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడ్డి, డీఆర్వో ఎం.శ్రీదేవి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మిప్రసన్న, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన ఉయ్యూరు నాగరాజు తనకు అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం జమ కాలేదని, త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
● ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన పేరూరి చంద్రశేఖర్ తన స్థలం ఆక్రమణకు గురైందని, రాకపోకలకు రహదారి లేకుండా చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జ రిపి తగిన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
● దెందులూరు మండలం గోపన్నపాలెంకు చెందిన వి.ధర్మారావు గ్రామ పంచాయతీలో డంపింగ్ పనులు పూర్తి చేశానని, చాలా కాలం గడిచినా బిల్లులు రాలేదని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు.
● టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన వట్టి రాధాకృష్ణ అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరారు.
● పెదవేగి మండలం పెదకడిమికి చెందిన చల్లగొల్ల వెంకటరావు తమ గ్రామంలో పాడి రైతులు చాలామంది ఉన్నారని తెలిపారు. పశువుల చెరువులో నీటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నిర్లక్ష్యం సహించం
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టరేట్ హెచ్చరించారు. పీజీఆర్ఎస్ అర్జీలపై కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాఖల వారీగా పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన అర్జీలు పరిష్కార ప్రగతిలో లోటు కనిపించిన అధికారులపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
కలెక్టర్ వెట్రిసెల్వి


