ఏలూరు (టూటౌన్): పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఏలూరులోని గిరిజన భవన్లో ఘనంగా నిర్వహించింది. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కలెక్టర్ కె.వెట్రిసెల్వి జ్యోతిని వెలిగించి ఉగాది వేడుకలను ప్రారంభించారు. నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వేదాంతం విష్ణుప్రసాద్ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోకుండా ఆనందోత్సాహాలతో ఉగాది పండుగ జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. అనంతరం పంచాంగ శ్రవణం చేసిన వేదాంతం విష్ణు ప్రసాద్, వేదపండితులు పి.దుర్గాప్రసాద్, అగ్నిగోత్రం సీతారామాచార్యులు, కోసూరి హరి నరసింహాచార్యులు, ఎం.ఉమాకుమార్, సాంస్కృతిక విభాగంలో పి.సూర్యప్రకాష్, సేవల విభాగంలో కె.శ్రీనివాసులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డా.ఎంజే అభిషేక్ గౌడ దుశ్శాలువా, మెమొంటో, నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, సెట్వెల్ సీఈవో ప్రభాకర్, ఉద్యాన శాఖ డీడీ సాజా నాయక్, ఎంఐపీ పీడీ ఎస్ రామ్మోహన్, సమాచార శాఖ డిప్యూటీ ఇంజనీర్ యూ.సురేంద్రనాథ్, సహాయ పర్యాటక శాఖ అధికారి పట్టాభి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి నాగరాణి, దేవాదాయ శాఖ అధికారి కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


