● పంట గట్టుపై లబోదిబోమంటున్న బాఽధితులు
● బాధితులకు బియ్యం, నూనె, కూరగాయల పంపిణీ
ఆకివీడు : ఆకివీడు సిద్ధాపురంలో రోడ్డు ఆక్రమణల తొలగింపులో భాగంగా అధికారులు ఇళ్లను సైతం తొలగించారు. దీంతో రోడ్డున పడ్డ బాధితులు పంట గట్టుపై సామాన్లు వేసుకుని లబోదిబోమంటున్నారు. సుమారు 11 కుటుంబాల వారు ఇక్కడ రేకుషెడ్లు, కిక్కిస దడులు వేసుకుని నివసిస్తూ రెక్కల కష్టంతో బతుకుతున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, కనీసం అద్దె ఇళ్లు చూసుకుంటామని చెప్పినా జేసీబీతో తొలగించాని మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. చిన్న పిల్లలు, వృద్ధులతో ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలంటూ గుండెలవిసేలా రోదించారు. ఒకరిద్దరికి మాత్రమే అద్దె ఇళ్లు దొరికాయని మిగిలినవారి పరిస్థితి అయోమయంగా ఉందని వారు వైఎస్సార్సీపీ నాయకుల వద్ద వాపోయారు. బాధిత కుటుంబాలకు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కిల్లి రామకృష్ణ, గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు భూపతిరాజు బుజ్జిరాజుల ఆర్థిక సహకారంతో 25 కేజీల బియ్యం, మంచినూనె, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నంద్యాల సీతారామయ్య మాట్లాడుతూ ఆక్రమణల తొలగింపునకు వైఎస్సార్సీపీ అడ్డుకాదని, బాఽధితులకు ఇళ్ల స్థలం కేటాయించాలని, అద్దె ఇళ్లు దొరికేంతవరకూ అవకాశం కల్పించాలని మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. బాధితులకు ఇళ్ల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కిళ్లి రామకృష్ణ, బుజ్జిరాజు, పళ్ళెం పండు, మద్దా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


