ఎంపీహెచ్ఏల ఎంపికలో అవకతవకలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్ (ఎం) పోస్టులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం తీర్పులో జీఓ 1207 మేరకు ఉద్యోగాల నుంచి తొలగించిన ఎంపీహెచ్ఏ (ఎం) సిబ్బందిని పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జిల్లాలో అర్హులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి 104 మందిని పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర కు ఏలూరు జిల్లా అధికారులు ఈనెల 4న 41 మందితో జాబితా విడుదల చేశారు. మరోసారి 10న 43 మందితో జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. అయితే ఈ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రూపొందించిన జా బితాలో పీఎన్వీ సత్యనారాయణ (68) రిటైర్డ్ కాగా, పీఎన్వీ పెద్దిరాజు మరణించారని చెబుతున్నారు. ఇక 273 జీఓలోని మరో ఇద్దరు లక్ష్మయ్య, శ్రీను అనే వారిని ఎంపిక చేయటంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1207 జీఓ మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 104 మంది జాబితాలో 39వ పేరుతో తణుకు మండలం పైడిపర్రుకి చెందిన ముప్పిడి రత్నరాజుకు జాబితాలో చోటులేదని బాధితుడు వాపోతున్నాడు. తాను గతంలో అనారోగ్యంతో సెలవులో ఉన్నాననీ, మెడికల్ సర్టిఫికెట్లు సైతం అప్పట్లో ఏలూరు వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించానని చెబుతు న్నాడు. అయినా తన పేరును జాబితాలో పెట్టకపోవటంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాననీ, న్యాయం చేయాలని రత్నరాజు కోరుతున్నారు.


