
పేదల ఇళ్లు కూల్చడమే అభివృద్ధా?
కాళ్ల: పేదల ఇళ్లు కూల్చడమే కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధా అని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నర్సింహరాజు ప్రశ్నించా రు. మండలంలోని పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏర్పడేది ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకే కానీ ఇబ్బందులకు గురిచేసేందుకు కాదన్నారు. ఉండి నియోజకవర్గంలో కొంతకాలంగా ఇళ్లను తొలగిస్తున్నారని, దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఆక్రమణలో ఉన్న ఇళ్లు ఇబ్బందికరంగా ఉంటే నివాసితులకు సమయం ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించి తొలగించాలి తప్ప దుర్మార్గంగా ఇళ్లను కూలగొట్టడం సరికాదన్నారు. ఇళ్ల తొలగింపుతో రోడ్డున పడి ఇబ్బందులు పడుతున్న బాధితులను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధితులు నానా కష్టాలు పడుతున్నా గ్రామ, మండల స్థాయి, కనీసం జిల్లా అధికారులు కూడా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో గ్రామాలు ఏర్పడ్డాయని, గృహ నిర్మాణాలకు సాయం కూడా చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ సుఖసంతోషాలతో ఉండేవారని గుర్తుచేశారు. అయితే కూటమి పాలనలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పులపాలవుతున్నారని పీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ సమన్వయకర్త పీవీఎల్